వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: సీతక్క నోటి వెంట ఇలా కామెంట్లు వస్తాయనుకోలేదు. ఆమె ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చర్యమే అనిపించింది. పుట్టిన పసికందుల్ని పడేసే వారిని కఠినంగా శిక్షిస్తామని భయపెట్టాల్సింది పోయి… చెట్లకు ఊయలలు కడతాం.. అందులో వేయండని అనడమేంటో .. ఎవరిస్తున్నారో ఈ సలహాలు. అసలే రేవంత్కు ఉండే తలనొప్పులు వేరే ఉన్నాయి. ఇగో ఇలా మధ్యలో మంత్రులు చేసే కామెంట్లు, చేష్టలు మరింత ఇబ్బందికరంగా, నవ్వుల పాలు చేసేవిగా , చులకనగా చూసేలా చేస్తున్నాయి. కాదంటారా..?
త్వరలో మహిళల హక్కుల విూద పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మహిళ భద్రత కోసం పటిష్ట విధానాలను రూపొందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. చాలా చోట్ల ముళ్ళ పొదల్లో, చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళుతున్నారని.. చీమలు, కుక్కలు, చెత్త, ముండ్ల మధ్య శిశువుల ప్రాణాలు పోతున్నాయన్నారు. దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేస్తామన్నారు. బిడ్డలను పారేయకుండా.. ఆ ఊయలలో వదిలేస్తే వారి బాధ్యతను తామే స్వీకరిస్తామని అన్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు మేధో మధన సదస్సు ప్రాణం పోసిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
రెండు రోజుల పాటు- జరిగిన మేధో మధన సదస్సు ముగింపు సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అడ్మిషన్లను , హాజరును పెంచాలని మంత్రి ఆదేశించారు. ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి విూద కొన్నిసార్లు రక్షణ కరువవుతుందన్నారు. అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీంలను ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు. అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు తప్పవన్నారు. అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క వెల్లడించారు.
