హైదరాబాద్- వాస్తవం ప్రతినిధి:
సీఎం సీటులో ఎవరు కూర్చున్నా ప్రశ్నించడం మానొద్దని కవులకు పిలుపునిచ్చారు కవిత. సీఎం సీటులో తన తండ్రి కేసీఆర్ ఉన్నా సరే కవులు ప్రశ్నిస్తూనే ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనం నిర్వహించారు. కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదు.. పాలనలో లోపాలను ఎత్తి చూపాల్సిందేనన్నారు.
నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే నిజమైన కవి అని, తెలంగాణ ఉద్యమ కాలంలో యువత ఆత్మ బలిదానాలను కవులు తమ కవితల ద్వారా చెప్పేవారన్నారు. భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి కోసం మన నీళ్లు, వనరుల రక్షణ పై కవిత్వం రావాలన్న ఆమె.. కవులపై ఉన్న బాధ్యత పెద్దది.. సమాజాన్ని సరైన బాటలో నడిపేదే కవిత్వమేనన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా కవి ఆ పాలకులను ప్రశ్నిస్తూనే ఉండాలి.. మా నాన్న అధికారంలో లేరు కాబట్టే నేను ఇలా చెప్తున్నానని అనుకోవద్దు అని రేపు కేసీఆర్ ఉన్నా కేటీఆర్ ఉన్నా… కవితే ఉన్నా ప్రశ్నించడం మానొద్దనే విషయాన్ని ఆమె ఇలా పరోక్షంగా వెల్లడించారు.