(దండుగుల శ్రీనివాస్)
ఫక్తు రాజకీయం పాలనలో ప్రశ్నించేవాడుండొద్దు. అసెంబ్లీలో తను చెప్పింది గంటల తరబడి అలాగే విని తరించాలి. ఎదురు మాట్లాడొద్దు. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. అంతా తెలంగాణ జాతి పిత అని పిలవాలె. తనే తెలంగాణ. తెలంగాణే తను అని జనం నమ్మి తీరాలె. అందుకే ప్రతిపక్షం బలంగా లేకున్నా.. ఆ బలమూ లేకుండా దాన్ని భూస్థాపితం చేయాలె. దీనికి ఆయన ముద్దుగా పెట్టుకున్న పేరు రాజకీయ పునరేకీకరణ. అందమైన పేరొకటి తగిలించి.. తనేం చేసినా తెలంగాణ కోసమేనని తన వందీ మాగాధులతో పలికించి.. జనం తిలకించేలా చిత్రీకరించి ఇక శాశ్వతంగా తెలంగాణను తను లేదా తన ఫ్యామిలీనే సీఎం అనే లెవల్లో రాజకీయాలు నడిపాడు కేసీఆర్. ఇదెవ్వరూ మరిచిపోలేదు.
ఇవాళ సుప్రీం తీర్పు నేపథ్యంలో మళ్లీ పార్టీ ఫిరాయింపుల అంశం తెరమీదకు వచ్చింది. మూడు నెలల్లో ఆ పది మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను బాధ్యుడని చేస్తూ కోర్టు ఇచ్చిన సలహా తీర్పు పట్ల బీఆరెస్ మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. మళ్లీ ఈ అంశం తెరమీదకు రావడంతో ప్రధానంగా జనంలో డిస్కషన్ మొదలైంది. ఉప ఎన్నికలు వస్తాయా? రావా? కానీ చాలా మందికి తెలుసు. ఉప ఎన్నికలు రావు. అంతెందుకు కేసీఆర్, కేటీఆర్లకూ తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉప ఎన్నికలే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతామని కేటీఆర్ అన్నాడు. అప్పుడు కేసీఆర్ చేసిందేమిటీ? ఒకవేలు చూపితే మిగిలిన వేళ్లన్నీ బీఆరెస్నే దోషిలా చూపుతున్నాయి.
జనంలో ఇదే చర్చ జరుగుతోంది. బీఆరెస్ దీన్ని విజయంగా భావించడం పెద్ద జోక్గా చూస్తున్నారు జనం. ఆ విషయం బీఆరెస్ పార్టీ నాయకులకూ తెలుసు. కానీ ఉన్నవాళ్లను పోనీయకుండా కాపాడుకోగలిగాం రా దేవుడా! అని లోలోపల ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే బీఆరెస్పై దుమ్మెత్తి పోస్తున్నారు. సంతలో పశువులను కొన్నట్టు కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడు..? ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారా? అనే చీదరింపు మాటలు, చీత్కారాలు కూడా కనబడుతున్నాయి. ఏతా వాతా తేలేదేమిటంటే.. ఉప ఎన్నికలు అప్పుడు రానిది.. ఇప్పుడెట్లా వస్తాయి?? రావు. అంతేకదా రావులు.

Dandugula Srinivas
Senior Journalist
8096677451
