(దండుగుల శ్రీనివాస్)
అధికారంలో ఉన్నప్పుడు ఎవరి రేంజ్లో వాళ్లు తప్పులు మూటగట్టుకున్నారు. పాపాలు వెనకేసుకున్నారు. నమ్ముకున్నవారి ఉసురు తీశారు. ఇప్పుడు డైరీలలో పేర్లు రాసుకుంటాం… బిడ్డా.. మీ అంతు చూస్తామంటున్నారు. మాదే అధికారమని వీళ్లకు వీళ్లే డిసైడయిపోతున్నారు. ఇక్కడ పండిత పుత్ర పరమశుంఠ కాదు.. పండితుడూ ఆ తాను ముక్కే అయ్యాడు. తేడా లేదు. బాప్, బేటా, బేటీ అంతా ఒకటేనని మరోసారి నిరూపించుకున్నారు. వరంగల్ సభలో ఇది కేసీఆర్ మాటల ద్వారా తేటతెల్లమైంది.
ఏడాదిన్నర తరువాత బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు మరోసారి ఆ కుటుంబం తెలంగాణ ప్రజల మీద ప్రేమకన్నా అధికార దాహంతో రగిలిపోతున్న వైనాన్ని కండ్లకు కట్టింది. డైరీల రాస్కోర్రి మాదే అధికారం. మేమే వస్తం.. ! అవును వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు సర్కార్ ఏది చెబితే అదే కదా చేయాల్సింది. అప్పుడు నువ్వు చెప్పినప్పుడూ అదే కదా చేసింది. మధ్యలో ఈ బెదిరింపులు దేనికి…? సోషల్ మీడియాలో అరాచకశక్తులుగా మారి బీఆరెస్ పేరుతో కొనసాగుతున్న వారియర్లకు కేసీఆర్ మద్దతు తెలిపాడు. అందులో చాలా మంది సీఎంను చీపుగా చీపురుపుల్లతో సమానంగా బాడీ షేమింగ్తో తిట్లదండకాలే ఉన్నాయి ఎక్కువగా.
ప్రశ్నలు లేవు. నిలదీతలు లేవు. యథారాజా తథా ప్రజా అన్నట్టు తమ నేత కేటీఆర్ అడుగు జాడల్లో కొనసాగుతోంది ఆ సోషల్ మీడియా. ఇప్పుడు వీళ్లు జైళ్లకు పోతే బెయిలిస్తాం.. లీగల్ టీమ్ ఉంది.. అన్న కేసీఆర్.. మరి ఉద్యమ సమయంలో ఎంతో మందిపై కేసులున్నాయి. వారంతా ఇంకా కేసులు మెడలేసుకుని తిరుగుతున్నరు. వారికేమన్నా సాయం చేశావా..? అధికారంలో ఉన్నప్పునడు ఏమన్నా పదవులిచ్చావా..? పోనీ ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థికంగా మీరేమైనా ఆదుకున్నారా..? ఇప్పుడిలా రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావడమే పరమావధిగా చవకబారిన స్పీచ్ ఒకటి వదిలాడు వందల కోట్లు ఖర్చు పెట్టిన సభలో. కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు అక్కడ స్పేస్ లేదు.
ధరణి పై వివరణిచ్చేందుకు నోరు పెగళ్లేదు. తిలా పాపం తలా పిడికెడన్నట్టు .. ఇక్కడ తిలా పాపం తలా ఓ డైరీ అంటు మనిషికో డైరీ చేతబట్టుకుని ఇక సీరియస్గా పేర్లెక్కిచ్చే పనిలో పడ్డారీ ముగ్గురు. తండ్రొక డైరీ. కొడుకొక డైరీ. బిడ్డొక డైరీ. ఇలా తలా ఒక డైరీ మెయింటేన్ చేస్తున్నారు. అంతా కలిసి అంతు చూస్తారు. ఖతం చేస్తారు ఖబడ్దార్..!