(దండుగుల శ్రీనివాస్)
రాస్కోరా సాంబ… వచ్చేది మేమే… మా వైపే జనాలు… మీకు ఇంకా సమజ్ అయితలేదా..? ఎందుకు మా పోరగాళ్ల మీద కేసులు పెడుతున్నరు. ఇంటికి పోయి డైరీల రాస్కోర్రీ.. ఇగ మేమే వస్తం.. అన్నాడు కేసీఆర్ పోలీసులనుద్దేశించి. ఇక మీ పని ఉందిరోయ్..! అని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. సేమ్ టు సేమ్ కవిత, కేటీఆర్ లెక్కనే అనుకో. వాళ్లు మేము డైరీల మీ పేర్లు రాస్తున్నాం అన్నరు. కేసీఆర్ మాత్రం మీ డైరీల రాసుకోర్రి మళ్లీ వచ్చేది మేమే… అని చెప్పకనే ,చెప్పిండు.. మేం రాంగనే మీ భరతం పడతం రో పోలీసులు..! అని. ఇక వరంగల్ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటల్లో చెప్పుకునే అంశాలుకొత్తవేమీ లేవు. అన్నీ పాతవే. పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి అన్నట్టుగానే ఉన్నాయి.
కత్తి మాకిచ్చి యుద్దం చేయమంటే ఎలా..? జనాలకు ఇప్పుడన్నా తెలిసిందా..? ఇకనైనా ఆలోచన చేసి ఏడ పోగొట్టుకున్నమో ఆడనే దొరకవట్టుకోవాలె… అంటూ జనం మీద .. ఓటరు తీర్పు మీద సేమ్ కేటీఆర్, కవితలు అన్నట్టుగానే అసహనం ప్రదర్శించాడు. ఉచిత సలహాలిచ్చాడు. ఉచితోపదేశం చేశాడు. సర్కార్కే కాదు జనానికీ చివాట్లు పెట్టాడు. పోలీసులను బాహాటంగానే బెదిరించిన కేసీఆర్… బీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్కు సపోర్టుగా నిలిచాడు. ఓ రకంగా మీరు రెచ్చిపోండ్రా తమ్ముళ్లూ నేనున్నా మీకు అన్నట్టుగానే మాట్లాడాడు. మెయిట్ స్ట్రీమ్ మీడియాను వదిలి.. పూర్తిగా సోషల్ మీడియా పంచన చేరిన విషయాన్ని స్పష్టం చేశాడీవేదికగా కేసీఆర్. హైడ్రా నా నీ బొందనా అని రేవంత్ను తిట్టాడు. ఎక్కడా రేవంత్ పేరు తీసుకురాలేదు. కేసీఆర్ కిట్లు ఎందుకు నిలిపివేశావు..? అని నిలదీశాడు.
ఆరోగ్య శ్రీ మేము అమలు చేయలేదా..? ఇంత నారోటిక్ సీఎంగా ఉన్నవేంది అన్నట్టుగా చివాట్లేసినట్టు మాట్లాడాడు. కట్నె ఇల్లు.. పెట్టిన పొయ్యి కూడా మెయింటేన్ చేయరాదా.. ఎందుకున్నరు. 420 హామీలిచ్చారు…? ఏవి అమలు చేశారు..? ఇంత మోసం చేస్తరని అనుకోలే.. అని ఏడ్చినంత పనిచేశాడు కేసీఆర్. నా మనసు బాధైతాంది.. దుఃఖమైతాంది. అని కూడా అన్నడు. అప్పుడు మేము ఆదాయం పెంచుతూ పోతే.. ఇప్పుడు పూర్తిగా దివాళా తీయించారన్నాడు. డిప్యూటీ సీఎం 30 శాతం కమీషన్లు దండుకుంటున్నాడని విరుచుకుపడ్డాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ తెలంగాణకు నెంబర్ వన్ విలన్ అన్నాడు. అన్నింటా ఫెయిల్ అయిన కాంగ్రెస్ను జనం తరిమికొడతారని, ఇకపై తాను యాక్టివ్ రాజకీయాల్లో ఉంటానన్నాడు.