(దండుగుల శ్రీనివాస్)
ఇంట్లో ఎలుకలు పడితే ఇళ్లంతా తగులబెట్టిండట వెనుకటికొడు. అలాగే కొనసాగింది కేసీఆర్ వైఖరి ఆనాడు. ఇదే విషయాన్ని ఉటంకించాడు సీఎం రేవంత్రెడ్డి. రెవెన్యూ శాఖలో కొంత మంది అవినీతిపరులున్నారని మొత్తం ఆ శాఖ ఉద్యోగుల్నే దొంగలుగా చిత్రీకరించాడు కేసీఆర్. అసెంబ్లీలోను, బహిరంగ సభల్లోనూ రెవెన్యూ ఉద్యోగులను దొంగలంటూ వ్యాఖ్యానించి వారి మనోధైరాన్ని దెబ్బతీశాడు. జనాల్లో వారి పరపతిని పలుచన చేశాడు. ఇదే విషయాన్ని గుర్తు చేశాడు రేవంత్రెడ్డి. ప్రభుత్వ పరిపాలనలో కీలక భూమిక పోషించేది వారేనన్నాడు. పథకాల అమలులో ప్రభుత్వానికి మంచిపేరును తీసుకొచ్చేదీవారేనన్నాడు.
అలాంటి రెవెన్యూ ఉద్యోగుల సేవలను గుర్తించకుండా వారిని తూలనాడి బద్నాం చేశాడని కేసీఆర్ను దునుమాడాడు రేవంత్. తన స్వార్థ రాజకీయాల కోసం, లబ్ది కోసం ధరణి ని ప్రవేశపెట్టి జనాల జీవితాలతో ఆటలాడుకున్న కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నడుచుకున్నాడని గుర్తు చేశాడు. రేవంత్ స్పీచ్ రెవెన్యూ ఉద్యోగుల్లో కొత్త జోష్ నింపింది. వారిలో కొత్త భరోసా నిండుకున్నది.
తమ ఆత్మగౌవరాన్ని పెంచే విధంగా సీఎం ప్రసంగం ఉండటంతో వారెంతో ఆనందం వ్యక్తం చేశారు. సభ అనంతరం ఉద్యోగులు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ పరిపాలనలో తామెన్నో అవమానాలకు గురయ్యామని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం తమ ఆత్మగౌరవాన్ని పెంచేలా పరిపానల, నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆనందాన్ని వ్యక్తం చేశారు.