(దండుగుల శ్రీనివాస్)
ఉద్యోగ జేఏసీ పేరుతో లచ్చిరెడ్డి నకిలీ రాజకీయం నడుపుతున్నాడని టీవీఆర్వో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ ఘాటు విమర్శలు చేశారు. లచ్చిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఈమేరకు ఉద్యోగ జేఏసీ నేతలతో కలిసి మంత్రులకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. ఇప్పడిది ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజులుగా లచ్చిరెడ్డికి, ఉద్యోగ సంఘ నేతలకు మధ్య వార్ నడుస్తోంది. తనకు తాను సెపరేట్ దుకాణం పెట్టుకుని తనకు తానే ఉద్యోగ జేఏసీ అని ప్రకటించుకున్న లచ్చిరెడ్డి వైఖరి, వ్యవహారంపై అంతా భగ్గుంటున్నారు. ఈసారి ఇలా ఏకంగా బహిరంగ విమర్శలు చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది.
కొంతమంది నాయకులుగా పేరు చెప్పుకుని “పరీక్ష రాయండి, పాస్ చేయిస్తాం” అని చెప్పడం పూర్తిగా తప్పు. అలాంటి మాటలు నమ్మి వీఆర్వోలు మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని సతీష్ పరోక్షంగా లచ్చిరెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇతర సంఘాల నాయకులను అవమానిస్తూ, 13.5 లక్షల మంది ఉద్యోగుల ఆధారంగా ఏర్పడిన జేఏసీని విమర్శించడం మీ స్థాయి సరిపోదని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జేఏసీపై దుష్ప్రచారం మంచిది కాదని హితవు పలికారు. కొంతమంది నేతలుగా మాట్లాడుతున్న వారు వీఆర్వోలకు సంబంధం లేని వ్యక్తులు. వారి మాటలు నమ్మొద్దు. “మీ సేవ తిరిగి తీసుకుంటాం” అనే అబద్ధపు హామీలను నమ్మడం ప్రమాదకరం…అంటూ లచ్చిరెడ్డి మాటలను ఉటంకిస్తూ తీవ్ర విమర్శలు చేయడం కలకలం రేపింది.
చరిత్రలేని వ్యక్తులు చరిత్రను సృష్టించలేరు. అలాంటి నేతలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా, ఇప్పుడు ప్రసంగాలు చేయడం విడ్డూరంగా ఉంది. వారు ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీయడం ఆపాలి అంటూ లచ్చిరెడ్డిని హెచ్చరించారు సతీష్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టిడిపి ప్రభుత్వం రెవెన్యూ శాఖను రద్దు చేయబోతున్న సమయంలో, జెండాలు ఎత్తి, ఉద్యమాలు చేసి, రెవెన్యూ శాఖను కాపాడింది. రెవెన్యూ సంఘాలతో పాటు. అప్పటి గ్రామస్థాయి ఉద్యోగుల వ్యవస్థ అని గుర్తు చేశారు. జేఏసీ పేరుతో నకిలీ నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ, జిల్లాల్లో తిరుగుతూ డబ్బాలు కొట్టించుకోవడం లచ్చిరెడ్డి మానుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారను. మీకు నిజమైన తెలంగాణ జేఏసీని విమర్శించే అర్హత లేదని దుయ్యబట్టారు.