(దండుగుల శ్రీనివాస్)
ఒకేరోజు రెండు విభిన్న సంఘటనలు. ఒకటి కొత్త ఊపిరినిస్తే.. ఇంకోటి ప్రాణాలు తోడేసి పరువును బజారుపాలు చేసేలా చేసింది. సర్కార్కు ఒకేరోజు రెండు అనుభవాలు. సన్నబియ్యం పథకంతో జనాలు హర్షించారు. సీఎం రేవంత్రెడ్డిని మెచ్చుకున్నారు. గతంలో కేసీఆర్ చేయని విధంగా చేసి తమకు సన్నబియ్యం కొనుక్కునే ఖర్చు లేకుండా చేశారని బాహాటంగానే చెప్పుకున్నారు. ఇదో సంబురంలా చేసుకున్నారు. లీడర్లు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. సర్కార్ వరుసగా వ్యతిరేకత పెరుగతూనే వస్తుంది గానీ, ఇప్పటి వరకు జనాలు నిజంగా మనస్పూర్తిగా మెచ్చుకున్నది లేదు. ఈ సన్నబియ్యం పథకం జనాలకు బాగా కనెక్టయ్యింది.
రేషన్ షాపుల్లో గతంలో దొడ్డు బియ్యం తీసుకోగానే ..అ క్కడే రేషన్ డీలర్కు రూ. 15 కేజీ అమ్మేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బయట రీ సైక్లింగ్కు అమ్ముకునే పరిస్తితి కూడా లేదు. గతంలో సన్నబియ్యం బహిరంగ మార్కెట్లో కిలో రూ. 50 నుంచి కిలో రూ. 60 వరకు పెట్టి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఫ్రీ బియ్యంతో పేద కుటుంబాల ఆర్థిక బడ్జెట్లో ఎంతో ఊరటలభించింది. సేమ్ అదే సమయంలో హెచ్సీయూ భూముల వేలంపై సర్కార్ బద్నాం అయ్యింది. యావత్ రాష్ట్రమే కాదు.. దేశం కూడా దీనినై నజర్ పెట్టింది. అంతా ముక్తకంఠంతో సర్కార్ చేస్తున్న పనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్టు కాదని ఖండించారు. ఒకే రోజు శభాష్ అని కితాబునందుకున్న సర్కార్.. ఆ సంతోషాన్ని ఎక్కువసేపు నిలుపుకోలేకపోయింది. ఆ వెంటనే తిట్లూ శాపనార్ధాలు కూడా అందుకున్నది.