మ్యాడం మ‌దుసూద‌న్‌
సీనియ‌ర్ పాత్రికేయులు..

భూసేక‌ర‌ణ‌, భూముల వేలం రేవంత్ స‌ర్కార్‌కు ఉచ్చులా మారుతోంది. మొన్న ల‌గ‌చ‌ర్ల‌, నేడు కంచె గ‌చ్చిబౌలి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల వేలం తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్న‌ది. గ‌తంలో కేసీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి భూముల వేలం వేసిన‌ప్పుడు ఇంత ప్ర‌జా వ్య‌తిరేక‌త లేదు. ప్ర‌భుత్వం బ‌ల‌హీనంగా ఉండ‌టం, ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మార‌డం వ‌ల్ల గ‌చ్చిబౌలిలోని 400 ఎక‌రాల ప్ర‌భుత్వ భూముల వేలం స‌ర్కార్‌కు ఇర‌కాటంగా మారింది. ఉద్య‌మాలు, రాజ‌కీయ పార్టీల జోక్యం వ‌ల్ల ఆందోళ‌న తీవ్ర మ‌వుతోంది. భూముల సేక‌ర‌ణ వేలం పాట‌లో చ‌ర్య‌, ప్ర‌తిచ‌ర్య‌లు , ప‌రిణామాలు, ప్ర‌తికూల ప‌రిణామాల‌ను రేవంత్ స‌ర్కార్ ముందుగా అంచ‌నా వేయ‌క‌పోవ‌డం త‌ప్పిదంగా మారుతున్న‌ది. వాస్త‌వానికి హెచ్ సీయూ ఆధీనంలో 400 ఎక‌రాలు ఉన్న‌ప్ప‌టికీ రికార్డుల‌లో స‌ర్కార్ భూమిగానే ఉంది. చంద్ర‌బాబు నాయుడు హ‌యాం నుంచి .. అంటే 2000 సంవ‌త్స‌రం నుంచి హెచ్ సీయూ భూములు పారిశ్రామిక‌, వ్యాపార అవ‌స‌రాల‌కు కేటాయించడం మొద‌లైంది. క్ర‌మంగా 2, 300 ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూములు నేడు 1700 ఎక‌రాల‌కు కుదించుకుపోయాయి. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 2003లో గ‌చ్చిబౌలి స్టేడియం, ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఐఐటీ వంటి సంస్థ‌ల‌కు ఇవ్వ‌డ‌మే కాకుండా నియ‌మ నిబంధ‌న‌లు పాటించ‌కుండా మ‌రో400 ఎకరాల‌ను ఐఎంజీకి చెందిన బెల్లీరావు కు కేటాయించ‌డం రాజ‌కీయ దుమారం రేపింది. అప్ప‌ట్లో పీసీసీ చీఫ్‌గా ఉన్న రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఈ కేటాయింపుల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. క్విడ్‌ ప్రో కో కింద చంద్ర‌బాబు అప్పనంగా భూముల‌ను బెల్లీరావుకు అప్ప‌గించార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అనూహ్య‌మైన రీతిలో తెలుగుదేశం పార్టీ ప‌త‌నం కావ‌డం, 2004లో కాంగ్రెస్ స‌ర్కార్ రావ‌డంతో భూమి కేటాయింపులు ర‌ద్ద‌య్యాయి. కేటాయింపుల ర‌ద్దును స‌వాల్ చేస్తూ బెల్లీరావు కోర్టుకెక్క‌డంతో స‌మ‌స్య పెండింగ్‌లో ప‌డింది.

02Vastavam.in (4)

అయితే, 2004 నుంచి కోర్టులో పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌కు రేవంత్ స‌ర్కార్‌లో ప‌రిష్కారం దొరికింది. కేటాయింపుల ర‌ద్దు స‌బ‌బేన‌ని, ఆ భూమంతా స‌ర్కార్‌దేన‌ని సుప్రీం కోర్టు కూడా తీర్పునిచ్చింది. దీంతో రేవంత్ స‌ర్కార్ విలువైన 400 ఎక‌రాల భూమిని వేలానికి పెట్టింది. కానీ, ఇప్ప‌టికే 2300 ఎక‌రాల నుంచి 1700 కుంచించుకుపోయిన హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల‌ను వేలం వేయ‌డం వ‌ర్సిటీ ఉనికినే ప్ర‌మాదంలో ప‌డేస్తుంద‌ని ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. మొద‌ట్లో విద్యార్తులు ప్రారంభించిన ఆందోళ‌న ప్ర‌స్తుతం రాజ‌కీయ మ‌లుపు తిరిగింది. బీఆరెస్, బీజేపీ లు చేరోవైపు విద్యార్థుల‌కు అండ‌గా నిలుస్తూ రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొంద‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.


అయితే, అక్క‌డ పెద్ద పులులు లేవు, గుంట‌న‌క్క‌లే ఉన్నాయ‌ని అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదస్ప‌దంగా మారాయి. వాస్త‌వానికి హెచ్ సీయూ భూముల్లో అపార‌మైన ప్ర‌కృతి సంప‌ద ఉంది. ప్ర‌త్యేక‌మైన జీవ‌వైవిధ్య‌ముంది. అక్క‌డ జాతీయ ప‌క్షి నెమ‌లితో పాటు రాష్ట్ర జంతువు చుక్క‌ల జింక‌లు, అడ‌వి పందులు, పెద్ద పులి, చిరుత పులి త‌ప్ప ర‌క‌ర‌కాల వ‌న్య‌ప్రాణులున్నాయి. గ‌తంలో 1990 -1995లో చిరుత పులులు సంచ‌రించిన దాఖ‌లాలున్నాయి. అత్యంత విలువైన జీవ‌వైవిద్య‌మున్న ఈ ప్రాంతాన్ని రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌గా మార్చ‌డం విద్యార్థుల‌నే కాదు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌ల‌ను కూడా ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది.

ఇక్కడ విష‌య‌మేమిటంటే, గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్ స్కూల్‌, గ‌చ్చిబౌలి స్టేడియం ఇత‌ర అవ‌స‌రాల‌కు కేటాయించ‌గా, గ‌త బీఆరెస్ ప్ర‌భుత్వం కోకాపేట‌లో భూముల వేలం వేసిన‌ట్టే ఇక్క‌డా కూడా అదే రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌ను వేలం వేస్తున్న‌ది రేవంత్ స‌ర్కార్‌. అదేమంటే, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు, అవ‌స‌ర‌మైన నిధుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డానికి ఇది చేస్తున్న‌ట్టు స‌ర్కార్ వాదిస్తున్న‌ది. గ‌త ప్ర‌భుత్వాలు అనుస‌రిరించిన విధానాన్నే ఈ స‌ర్కార్ అనుస‌రిస్తున్న‌ది. కానీ ఇక్క‌డ విద్యావ్యాప్తి కోసం కేటాయించిన భూముల‌లో రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ చేయ‌డ‌మే వివాద‌స్ప‌దంగా మారుతోంది. ప‌ర్యావ‌ర‌ణంతో పాటు విద్యావ్యాప్తి కూడా దెబ్బ‌తింటుంద‌న్న‌ద‌ని ఆందోళ‌న‌కు రోజు రోజుకు ప్ర‌జా మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ది. ముందు ఒప్పించి మెప్పించి ప‌నిచేయ‌డంలో ఈ స‌ర్కార్ విఫ‌మ‌వుతోంది. ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూప‌డం లేదు. ఇది దేనికి దారి తీస్తుందో తెలియ‌దు. స‌ర్కార్ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి.

You missed