మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ సీరియల్ కొనసాగుతున్నది. అధ్యక్ష పదవి రేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటున్నది. వారానికో కొత్త పేరు తెరమీదకు వస్తున్నది. ఒకదశలో మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రథ సారథి కావడం ఖాయమైంది. కానీ, రాష్ట్రంలో బడా నాయకులు, ఆరెస్సెస్ నుంచి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు లభించకపోవడంతో కేంద్ర పార్టీ పునరాలోచనలో పడింది. ఒకవైపు మాజీ అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్ని విధాల ఈటల రాజేందర్కు అడ్డంగా టక్కరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పార్టీ మూల స్థంభాలుగా ఉన్న సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈటలను బలపర్చకపోవడం, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి న్యూట్రల్గా ప్రేక్షకపాత్ర వహించడం, పరోక్షంగా ఈటలకు మద్దతుగా నిలవకపోవడం కేంద్ర పార్టీని గందరగోళంలో పడేసింది. వాస్తవానికి, గత ఏడాదిగా అధ్యక్ష పదవిపై ఎంతెంతకాలం ఇంకెంతకాలమన్నట్టు ఒడవని సీరియల్గా కొనసాగుతున్నది. అనూహ్య పరిణామాల క్రమంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు దూకుడుగా ఉన్న బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో తెలంగాణలో ఆ పదవి తాత్కాలికంగా మారిపోయింది.
అప్పటి నుంచి ఇప్పుటి వరకు కిషన్రెడ్డి తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ ఆయా సంస్థాగత ఎన్నికలు పూర్తవుతున్నా అధ్యక్ష పదవి ఒక కొలిక్కి రాలేదు. సామాజిక సమీకరణలు, తెలంగాణ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీఆరెస్ నుంచి పార్టీలో చేరిన ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవిని కట్టబెట్టాలన్న ప్రతిపాదన మొదటి నుంచి కేంద్రం వద్ద పెండిగ్ లో ఉంది. హోమంత్రి అమిత్ షా కూడా ఈటల కు అధ్యక్ష పదవి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు.
కేంద్ర పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పటికీ రాష్ట్ర పార్టీలోని బడా నాయకులు, మరోవైపు ఆరెస్సెస్ రెడ్ సిగ్నల్ వేసింది. ఈటలకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేరు బడా నాయకులు తెరమీదకు తెచ్చారు. అదే క్రమంలో ఒక వైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఇంకోవైపు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి లు అద్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరికొచ్చినా ఎవరికియ్యకపోయినా… ఈటలకు మాత్రం వద్దని బడా నాయకులు అడ్డుపడటంతో కేంద్రం ఎటూ తేల్చుకోలేక మొట్టమొదటి సారి అయోమయ పరిస్థితులు ఎదుర్కొంటున్నది.
పార్టీ పరిశీలకురాలిగా ఉన్న కర్ణాటకు చెందిన శోభాకరన్ ఈ గొడవల కారణంగా ఇప్పటి వరకు తెలంగాణలో అడుగు పెట్టలేకపోయింది. మరోవైపు కేంద్ర పార్టీకి ప్రత్యక్ష సంబంధాలున్నరాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ కూడా అంతా గప్చుప్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆరెస్సెస్ నుంచి డీఎన్ఏ సమస్య ఎదురైంది. ఈటల రాజేందర్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం రాడికల్, లెఫ్ట్ వింగ్ నుంచే ఉందని, ఆయనకు ఇతర పార్టీలతో సత్సంబంధాలున్నాయని, ఈ క్రమంలో ఆయన దూకుడుగా వ్యవహరించకపోవచ్చని ఆరెస్సెస్ కూడా అభిప్రాయపడుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో పార్టీ అధిష్టాన వర్గానికి నివేదిక ఇచ్చిందని ఓ రూఢీ కాని సమాచారం.
ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల సామాజిక సబంధాలు, ఉద్యమ సంబంధాలు, సామాజిక సమీకరణలు కలిసి వచ్చి పార్టీ బలపడుతుందని తెలంగాణ సమాజం భావిస్తున్నప్పటికీ .. పార్టీలో అభిప్రాయం ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన వ్యక్తిత్వానికి రాజకీయ డీఎన్ఎ కు సరిపోదని కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం , అధ్యక్ష పదవిని ఇతరులకు ఇవ్వడం మంచిదని కొంత సూచిస్తన్నట్టు బడా నాయకులు అత్యంత విశ్వసనీయ సమాచారం.
మొదటి నుంచి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి రాకుండా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆయన ఈటల ఏ విధంగా సరైన అభ్యర్థి అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దుందుడుకుగా వ్యవహరించే అర్వింద్, తెలివిగా వ్యవహరించే రఘునందన్ పేర్లు కూడా ప్రముఖంగా పరిశీలనకు వచ్చాయి. మధ్యేమార్గంగా రాంచందర్రావు పేరును బడానాయకులు సూచిస్తున్నారు. ఎందుకంటే బడానాయకులకు బలమైన నాయకులు పార్టీ అధ్యక్షుడిగా ఉండటం ఎప్పుడైనా ఇష్టం ఉండదు. కానీ, గత కొన్ని రోజులుగా గతంలో వద్దనుకున్నా బండి సంజయ్ పేరే మళ్లీ తెరమీదకు వస్తున్నది. దూకుడుగా ఉండే బండి సంజయ్లాంటి నాయకులకే సారథ్య బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పటిష్టమవుతుందని కేంద్ర పార్టీకి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా బండి సంజయ్ రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారిస్తూ ప్రభుత్వంపై వాడీవేడీ విమర్శలు చేయడం దీనికి ఊతమిస్తున్నది.
ఒకవేళ బండి సంజయ్కు అధ్యక్ష పదవి ఇవ్వాల్సి వస్తే ..కేంద్ర మంత్రి పదవి ఈటల రాజేందర్కు ఇవ్వవచ్చనేది సమాచారం. ఈనెల 15న బెంగులూరులో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి అంతలోపే రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారు కావాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తే అంతలోపు కూడా కావడం సందేహంగా మారింది. గతంలో ఎన్నడూలేని విధంగా పార్టీ అధ్యక్ష పదవిపై సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. చివరికి ఎవరికి అద్యక్షుడిని చేయలనేది సమస్యగానే మారింది. ఈటల రాజేందర్కు పార్టీ నుంచి ఆరెస్సెస్ నుంచి కూడా ప్రతికూల సంకేతాలందడంతో కమలం రాజకీయం రంగుమారుతున్నది. ఇప్పటికైనా ఈటల రాజేందర్కు పదవి దక్కే అవకాశాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉంది.