(దండుగుల శ్రీ‌నివాస్‌)

డా. కాకునురి సూర్యనారాయణ మూర్తి.ఈయ‌న బ‌త‌క‌నేర్చిన పంతులు కాదు. ఎవ‌రీ పంతులు…? బీజేపీ ఆఫీసులో ఉగాది సంద‌ర్బంగా పంచాంగ శ్ర‌వ‌ణం చెప్పాడు. కాంగ్రెస్, బీఆరెస్ పార్టీ ఆఫీసుల్లో పంచాంగం చెప్పిన పంతుళ్లు లోక‌జ్ఞానం తెలిసిన‌వాళ్లు. అందుకే ఏ రోటికాడ ఆ పాట‌న్న‌ట్టు వ‌చ్చేసారికి మ‌ళ్లీ సీఎంగా కేసీఆరేన‌ని ఒక‌రంటే… మ‌రో ప‌దేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంద‌ని మ‌రొక‌రు. ఇలా ప్ర‌తీసారి జ‌రిగేతంతే. ఉగాది పంచాంగం అంటేనే జ‌నాల‌కు మంచి న‌మ్మ‌కం. అదో జాత‌కంగా భావిస్తారు. వ‌చ్చే భ‌విష్య‌త్తును ఈ పంచాంగం ద్వారా విని ఆనందిస్తారు. మంచి జ‌రిగుతుంద‌ని చెబితే సంతోషిస్తారు.

ఆదాయం త‌క్కువ, ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉంటే గాబ‌రా ప‌డ‌తారు. ఇక రాజ‌కీయంగా పార్టీల విష‌యానికొస్తే ఈ పార్టీల‌న్నీ ఆ రోజు పంచాంగ శ్ర‌వ‌ణం చెప్పించుకుంటాయి. ఈ పంచాంగం చెప్పే పంతుళ్లు ఆయా పార్టీల‌కే అనుకూలంగా శ్ర‌వ‌ణం చెప్పి న‌జ‌రానాలందుకుంటారు. అధికారంలో ఉన్న పార్టీల‌కు చెప్పే పంతులు.. మ‌ళ్లీ మ‌న‌దే అధికారం అంటాడు. ఇక మ‌న‌కు తిరుగేలేందంటాడు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ నిర్వ‌హించే శ్ర‌వ‌ణంలో పాల్గొన్న పంతులు… మీకే ఇక భ‌విష్య‌త్తుని ఘంటాప‌థంగా చెబుతాడు. అధికారం రాబోతుంద‌ని నొక్కివాక్కానిస్తాడు. ఇది ష‌రా మామూలుగా జ‌రిగేదే. జ‌రిగింది కూడా అదే.

కానీ ఇందుకు బీజేపీ మాత్రం భిన్నంగా పోయింది. ఆ పంతులు మాత్రం అధికారం గురించి ప‌ల్లెత్తు మాట కూడా తీయ‌లేదు. మ‌న‌కే అధికారం అని ఓ మాటంటే ఆయ‌న ముళ్లేంపోయింది. మ‌రీ ఇంత లౌక్యం తెలియ‌కుండా ఎట్లా అయ్యవారు. అన్ని విష‌యాలు చెప్పాడు. అధికారం ముచ్చ‌ట త‌ప్ప‌. దీంతో పార్టీల వారీగా జ‌రిగిన ఈ పంచాంగం శ్ర‌వ‌ణం కాంగ్రెస్‌, బీఆరెస్‌ల‌కు శ్ర‌వ‌ణానందాన్ని కలిగించ‌గా, బీజేపీ అభిమానులు, శ్రేణుల‌శ్ర‌వ‌ణాల‌కు మాత్రం అధికారం అనే మాట చేర‌లేదు.

You missed