(దండుగుల శ్రీనివాస్)
ఆ ముగ్గురూ ఇంకా మారలేదు. కేసీఆర్ ఇంకా ఫామ్హౌజ్ రాజకీయాలే చేస్తున్నాడు. ఆనాడు ఎన్నికల్లో అన్నట్టుగా నన్నోడిస్తే నాకేం నష్టం లేదు. నేను పోయి ఫామ్హౌజ్లో పంట. మీకే నష్టం. ఇప్పుడచ్చం అట్లనే చేస్తున్నాడు. పైగా నన్నోడించారు కదా అనుభవించండనే విధంగా మాట్లాడటం తీవ్ర విమర్శల పాలు చేసింది. నేనేం చేయాలి.. కత్తి నా చేతిలో లేదు కదా..? ఎలా యుద్దం చేయాలంటు ప్రజలను ప్రశ్నించే విధంగా, వెటకారమాడుతున్నట్టుగా ఉన్న ఆయన మాటలపై సోషల్ మీడియాలో దాడి కొనసాగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచావు కదా అని కొందరు.. దానికి కూడా రాజీనామా చేసేయ్ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఓడితే ప్రజల తరపున పోరాటం చేయడం నాయకుడి లక్షణం.. నీలా జనాలను తప్పుబట్టేలా మాట్లాడటం నీకే చెల్లిందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక కేటీఆర్ కూడా ఏం మారలేదు. సోషల్ మీడియా ఆధారంగానే పనిచేస్తున్నాడు. జీతాలిచ్చి మరీ కొందరి పెట్టుకుని అయినదానికి కానిదానికి ప్రభుత్వంపై పనికిరాని విధంగా, పరుషంగా విమర్శలు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బెదిరింపు రాజకీయాలకు దిగాడు కేటీఆర్. మీ సంగతి చూస్తాం బిడ్డా…. మీ అందరి పేర్లు రాసుకుంటున్నాం.. మీరు ఎక్కడికిపోయినా..విదేశాలకు వెళ్లి దాక్కున్నా వదలం గుంజి గుంజి కొడతాం అంటున్నాడు.
ఇది కూడా తీవ్ర విమర్శల పాలు చేసింది కేటీఆర్ను. ఇంకా నీకు అహంకారం తగ్గలేదనే విధంగా కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు సీఎం సీట్లో దొర పోయి దొంగ వచ్చి కూసుండని రేవంత్నుద్దేశించి అన్న కేటీఆర్ మాటలు కూడా విమర్శల పాలవుతున్నాయి. కేసీఆర్ను దొర అని ఒప్పుకున్నట్టే కదా.. అని సెటైర్లు మొదలయ్యాయి. కవిత కూడా పింక్ బుక్కు మెయింటేన్ చేస్తానంటున్నది. ఎవడినీ వదలదంట. జైలు నుంచి వచ్చిన నాడే మిత్తీతో సహా బాకీ తీర్చుకుంటానని శపథం పూనిన కవిత.. ఆ తరువాత పింక్ బుక్కు తెరపైకి తెచ్చింది. దీన్ని ఆసరా చేసుకున్న కవిత అనుచరులు.. బిడ్డా మీ పేర్లు పింక్ బుక్కులు ఎక్కుతున్నాయి… మీ బట్టలిప్పి కొడతాం అని పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఈ ముగ్గురికీ ఇంకా అహంకారమైతే తగ్గలేదనే విధంగా కామెంట్లు వచ్చిపడుతున్నాయి.
ఓ వైపు కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ప్రచారం నేపథ్యంలో వీరి వైఖరి పార్టీకి బలం చేకూర్చకపోగా..మరింత డ్యామేజీ చేసే విధంగానే ఉంటుంది. ప్రజల్లో కూడా కొంత సింపతీ వచ్చే లోపే వీరి వ్యవహార శైలి విముఖతను, అయిష్టత, కోపాన్ని తెచ్చిపెడుతోంది.