వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్!
పదేండ్లు బీసీలను నిండా ముంచింది బీఆరెస్ పార్టీనేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. కవిత బీసీల కోసం ధర్నా పేరిట కొత్త నాటకానికి తెరలేపిందని తీవ్రంగా దుయ్యబట్టిన ఆయన పదిహేను ప్రశ్నలను సంధించాడు. వీటికి సమాధానమిచ్చి ఆ తరువాత ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో జైలు పాలైన కవిత.. ఆ మరక పోగొట్టుకునేందుకు ఇప్పుడు కొత్త బీసీ జపం చేస్తుంన్నదని విమర్శించారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు.
1) కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా..?
2) బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?
3) స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా..?
4) స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?
5) జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?
6) గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?
7) కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?
8) గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా..?
9) బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?
10) ఎమ్బీసీ కార్పొరేషన్కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?
11) మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?
12) బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?
13) గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ చార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?
14) 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా..?
15) బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, వారికి మరింత ప్రయోజనకరంగా ఉండేలా సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి ధర్నా చేపట్టడం దురదృష్టకరం.
బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చర్యలు, ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనలో చేపట్టిన చర్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని నేను కవితను బీఆర్ ఎస్ నేతలను సవాలు చేస్తున్నాను.