మూడింతలు పెరిగిన పసుపు సాగు…
పెరిగిన ధరతో దేశ వ్యాప్తంగా రైతుల ఆసక్తి..
ఈసారి సీజన్లో క్వింటాలు కు అత్యధికంగా 18, 300 ధర..
పసుపు సాగులో మొదటి స్థానం మహారాష్ర్టదే.. ఆ తరువాత తెలంగాణ…
నాలుగేళ్ల కింద క్వింటాలుకు నాలుగు వేల రూపాయలకు మించి రాని ధర..
సాగుతగ్గి, డిమాండ్ పెరగడంలో అనూహ్యంగా ధరపెంపు.. దీంతో మూడింతలుగా పెరిగిన సాగు విస్తీర్ణం..
దండుగుల శ్రీనివాస్ — సీనియర్ జర్నలిస్ట్…
8096677451
పసుపు బంగారం ఒకప్పుడు. తరువాత ఆ స్థితిని మరీ దీనంగా ధర పడిపోయి పసుపు పండిస్తే ఆ రైతుకు నష్టమే తప్ప లాభం లేదనే పరిస్థితులు వచ్చాయి. నాలుగేళ్ల కిందట క్వింటాలుకు నాలుగు వేలే ధర పలికింది. ఇదీ మరీ దారుణమైన పరిస్థితి. ఇక సాగు పడిపోతూ వచ్చింది. క్రమంగా పసుపుకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఎగుమతులు పెరిగాయి. బంగ్లాదేశ , గల్ప్ దేశాలకు పసుపు ఎగుమతులు కావడంతో ఒక్కసారిగా ధర పెరిగింది.
ఈ సీజన్లో పసుపు ధర క్వింటాలుకు గరిష్టంగా 18, 300 చేరింది. దీంతో రైతులు మళ్లీ పసుపు సాగు వైపు దృష్టి పెట్టారు. దీంతో కొత్త సీజన్ కోసం దేశ వ్యాప్తంగా సాగు విస్తీర్ణం మూడింతలు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రంలో పసుపు సాగవుతున్నది. ఒకప్పుడు పసుపుకు మంచి ధర కావాలంటే మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్లేవారు రైతులు. ఇప్పుడు అదే మహారాష్ట్రలో నాందేడ్, బస్మత్, హింగోళి లాంటి పెద్ద మార్కెట్లు ఏర్పడంతో రైతులకు మరింత సౌలభ్యంగా మారింది. ఇలా మార్కెట్ సౌకర్యం, ఎగుమతుల డిమాండ్లతో పసుపుకు మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టయ్యింది.
మహారాష్ట్ర, తెలంగాణ తరువాత ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అస్సాంలలో పసుపు సాగవుతున్నది. తెలంగాణలో నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్లలో పసుపు సాగవుతున్నది. ఏడాదికి ఒక సీజనే పసుపు సాగవుతుంది. జూన్, జూలై నెలలో సీజన్ ఆరంభవుతుంది. జనవరి, ఫిబ్రవరి నాటికి దిగుబడి వస్తుంది. నాలుగు నెలల వరకు మార్కెటింగ్ చేసుకుంటారు రైతులు. ఆమధ్య గ్యాప్లో మక్కలాంటి పంటలు వేసుకుంటారు. ఈసారి మూడింతలు పెరిగిన పసుపు సాగుకు తాజాగా వచ్చిన రేటే దక్కుతుందా.. పడిపోతుందా తెలియదు కానీ, రైతులు మాత్రం ఈ సాగుపై భారీ ఆశలు పెట్టుకున్నారు.