అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గాయాలపాలైన ట్రంప్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

పిడికిలి బిగించి నినాదాలు చేసిన ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు కలకలం రేపాయి. బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్లడంతో రక్తస్రావమైంది. గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దుండగుడి కాల్పుల్లో సాధారణ పౌరుడు మరణించినట్లు సమాచారం. మరోవైపు ట్రంప్పై కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.

ట్రంప్పై కాల్పులు.. బైడెన్, ఒబామా ఏమన్నారంటే?

అమెరికాలో హింసకు తావులేదని ప్రెసిడెంట్ జో బెడెన్ ట్వీట్ చేశారు. ‘కాల్పుల్లో గాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ట్రంప్, ఆయన కుటుంబం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మనం అందరం ఒక్కటై ఈ ఘటనను ఖండించాలి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ట్రంప్పై కాల్పులు.. హెల్త్ అప్డేట్

ఎన్నికల ర్యాలీలో దుండగుడి కాల్పులలో గాయాలపాలైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు. స్థానిక మెడికల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో త్వరగా స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్య వాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్ త్వరగా కోలుకోవాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.