అతనో స్టూడెంట్. అంతకు మించి మంత్రి హరీశ్రావుకు అభిమాని. ఆయన ఆరోగ్య మంత్రిగా ప్రజల ఆరోగ్యాలపై శ్రద్ద తీసుకోవడం బాగా నచ్చింది. కానీ ఆయన ఆరోగ్యం గురించే పట్టించుకోకపోవడం ఏ మాత్రం నచ్చలేదు. అందుకే ఓ లేఖ రాశాడు. సారు.. జర మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆ ప్లాస్టిక్ బాటిళ్ల నీళ్లు తాగుతూ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుర్రి…. జర జాగ్రత్త సారు..! అంటూ ఓ లేఖ రాశాడు. ఇదిప్పుడు వైరల్గా మారింది.
ఇగో ఇలా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మీ ఆరోగ్యమే మాకు మహా భాగ్యమని, మీరు తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారని, ప్లాస్టిక్ బాటిల్ నీరు తాగడం వల్ల శరీరంలో లివర్, చెస్ట్ క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని, ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలాజిస్ట్ డాక్టర్. విమల్ సోమేశ్వర్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందని చెప్పుకొచ్చారు. దయచేసి మీరు ఇక నుంచి కాపర్ వాటర్ బాటిల్ వినియోగించాలని కాగితంపై రాసి శుక్రవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్ రావుకు బల్వంతపూర్ రోడ్డు వైపు డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద అందించాడు. ఈ మేరకు దుబ్బాక మున్సిపాలిటీ 1వ వార్డు మల్లాయపల్లికి చెందిన ప్రవీణ్ అనే విద్యార్థి అభ్యర్థనను తప్పకుండా స్వీకరిస్తానని సార్ చెప్పారని ప్రవీణ్ తెలిపారు. ప్రస్తుతం ఇందూరు కళాశాలలో ఎంబీఏ చదువుతున్న ప్రవీణ్ ఆరోగ్య మంత్రి హరీశ్ మనస్సు గెలిచారని నెటిజన్లలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.