ఢీ అంటే ఢీ…. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ విమర్శనాస్త్రాలు… వేడెక్కిన రాజకీయం… కవిత ఆగ్రహం… అంతే ఘాటుగా ప్రతిస్పందిస్తున్న టీఆరెస్ శ్రేణులు…..
ఇదీ నేటి తెలంగాణ రాజకీయం. బీజేపటీ టీఆరెస్ మధ్య అగాథం మరింత పెరిగింది. నువ్వా..? నేనా..? ఢీ అంటే ఢీ అనే రేంజ్లో ఇద్దరి వైఖరి కొనసాగుతోంది. బీజేపీ కావాలనే కయ్యానికి కాలు దువ్వుతున్నది. టీఆరెస్ కూడా నిగ్రహం కోల్పోతోంది. అంతకు మించి స్పీడుతో కౌంటర్ ఇస్తున్నది. గవర్నర్ ఈ రోజు రాజ్ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేయడం కలకలం రేపింది. ఇదే హాట్ టాపిక్గా మారింది. ఓ గవర్నర్ ఈ స్థాయిలో సీఎంపై అటాక్ చేయడం ఇదే తొలిసారి.

ఆమె రాజ్భవన్ను బీజేపీ ఆఫీసుగా మార్చేసిందంటూ కొద్ది రోజులుగా టీఆరెస్ శ్రేణులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆమె కూడా దాదాపుగా అలాగే ప్రవర్తిస్తూ వచ్చారు. తనకు మర్యాద దొరకని వేళ.. ఎందుకు ఉపేక్షించాలని అనుకున్నారో… తన సహజ దోరణిని కప్పిపుచ్చుకుని కేవలం గవర్నర్ గిరీకే పరిమితమవ్వడం ఇష్టం లేకనో తెలియదు కానీ… ఆమె కొద్ది రోజులగా డైరెక్ట్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వస్తున్నారు. బాసర త్రిపుల్ ఐటీలో విద్యార్థుల వివాదంలో తలదూర్చడం, రంగారెడ్డి జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళలు చనిపోయిన సంఘటనలో నేరుగా నిమ్స్కు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించడం… ప్రజా దర్బారు నిర్వహించడం… ఇలా ఆమె పరోక్షంగా తనే ఓ ప్రతిపక్ష హోదా తీసుకుని సమయం చిక్కినప్పుడల్లా కేసీఆర్పై ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ రోజు ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. టీఆరెస్ శ్రేణులు కూడా ఆమెపై సోషల్ మీడియాలో దాడిని కొనసాగించారు. ఎమ్మెల్సీ కవిత కూడా గవర్నర్ వైఖరిని తప్పుబడుతూ ఘాటుగా తిప్పికొట్టారు. మరోవైపు.. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన దుందుడుతనాన్ని మరోసారి చాటుకున్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితనుద్దేశించి నేరుగా.. బతుకమ్మ ఈసారి ఎక్కడ ఆడుతావ్…? అంటూ మరీ వెటకారంగా, వ్యంగ్యంగా.. వెకిలిగా , అమర్యాదగా.. కామెంట్ చేశాడు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కావాలనే బీజేపీ కయ్యానికి కాలు దువ్వుతుందనే అభిప్రాయం కూడా అందరిలో వచ్చేసింది. సీఎం కేసీఆర్, కవితను టార్గెట్ చేసి బీజేపీ రాజకీయ దుమారం రేపే వ్యాఖ్యలను , రెచ్చగొట్టేవిధంగా కామెంట్లను చేస్తూ వస్తున్నది. ఈ మధ్య కేటీఆర్ను వదిలేసింది. ఆయన మొన్నటి వరకు కాలునొప్పి, కరోనా తో ఇంటికే పరిమితమయ్యాడు. ఎక్కువ రాజకీయాల జోలికి రాలేదు. మొన్ననే బయటకు వచ్చాడు. కేటీఆరూ ఇక సైలెంట్గా ఉండడు.. బీజేపీ ఉత్తగనే వదలదు… ఇది నడస్తూనే ఉంటుంది….
