చిరు ఫ్యామిలీకి మా ఎన్నికలు ఓ ఝలక్. ఇదంతా కుల రాజకీయం చుట్టూ తిరిగి .. చివరకు కమ్మలు గెలిచారు. కాపులు ఓడారు అన్నట్టుగా మారింది. లోకల్, నాన్లోకల్ ఫీలింగు బాగా పనిచేసింది. ప్రకాశ్ రాజ్ సమర్థుడే. కానీ లోకల్ సెంటిమెంటు ముందు కుదేలైపోయాడు. మెగా ఫ్యామిలీ మొత్తం చమటోడ్చినా ఫలితం లేకుండా పోయింది.
ఏ మాత్రం అవగాహనలేని , ఆవేశమే తప్ప ఆలోచన లేని మంచు విష్నుకు పట్టం గట్టడమంటే .. అసలక్కడ ఏం జరిగిందో ఊహించొచ్చు. దీనికి మరీ పెద్దగా హైప్ క్రియేట్ చేశారు. అసలు మా ఎన్నికలే చాట్ల తవుడు బోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు. దీనితో ఒరిగేదీ లేదు. సచ్చేదీలేదు. సినీ పెద్దలుగా చెప్పుకుంటున్న వారి పరువు, పరపతి కోసం పాకులాడటం తప్ప. గతంలో మా ఎన్నికలు ఇంతలా చిల్లర కాలేదు. ప్రకాశ్రాజ్ ఎంట్రీతోనే ఇది మరింత పెంట పెంట అయ్యింది.
గ్రూపులుగా విడిపోయారు. కొట్టుకున్నారు. తన్నుకున్నారు. తిట్టుకున్నారు. వాళ్ల మేథస్సును అంతా బయటపెట్టి.. నవ్వుల పాలయ్యారు. సినీ పెద్దలా మీరు గద్దలా అన్నట్టుగా ప్రవర్తించారు. ఎవరికీ ఓపిక లేదు. విశాల దృక్పథం అసలే లేదు. అవే సినిమా డైలాగులు, అవే జబ్బలు, తొడలు చర్చుకునుడు. అంతిమంగా మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్ వెంట ఉండి పరువు తీసుకున్నది.
ప్రశ్నించే గొంతే ప్రకాశ్ రాజ్. కానీ ఇక్కడ పరిస్థితులు ప్రశ్నించే గొంతుకు కాదు.. లోకల్ సెంటిమెంట్ రాజేసినోడికు మొగ్గు చూపాయి. చిల్లర పంచాయతీ పెట్టుకుని, అందరి దగ్గర చులకనై.. మరింత దిగజారి.. వాళ్ల లెవల్ ఏమిటో చూపించి.. గొంతులు చింపుకుని, నోరు తిరగని భారీ డైలాగులు కొట్టి.. ఈ రోత ఇంకెన్ని రోజులురా నాయనా..? అని విసుగొచ్చేలా చేసి మొత్తానికి ఇలా శుభం కార్డు వేశారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా.
మంచు విష్ణో మరొకడో.. ఎవడో ఒకడు.. గెలిచాడంతే.. అక్కడ ఇరగదీసేదేమీ ఉండదు. పొద్దున లేస్తే ఎవరి షూటింగులు వాళ్లు చూసుకోవాలి. పాపం మంచుకు అవి కూడా లేవు కాబట్టి.. రాజకీయాలు చేస్తూ బతికేయొచ్చు.
