అక్కలూ.. చెల్లెండ్లూ గో హెడ్ బెస్ట్ఆఫ్ లక్
మార్కెట్కు వెళ్లాలంటే లేదంటే షాపింగ్కు వెళ్లాలంటే భర్తనో, తమ్ముడినో, అన్ననో, నాన్ననో, పిల్లలనో ఎవరినో బతిమిలాడాలి. కారులోనో.. బైక్పైన్నో దింపమని మొత్తుకోవాలి. పిల్లలను స్కూలుకు పంపాలంటే ఆటో వచ్చే వరకు వెయిట్ చేయాలి. పుట్టింటి నుంచి ఎవరైనా వస్తున్నారంటే వారికి రిసీవ్ చేసుకోవాలని కుటుంబ సభ్యుల్లోని మొగవాళ్లను అభ్యర్థించుకోవాలి. మహిళలు.. యువతుల పరిస్థితి ఇలా ఉండేది. కాని ఇప్పుడు కాలం మారుతోంది. ఇంటిని చక్కదిద్దడమే కాకుండా స్టీరింగ్ తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. మగవాళ్లతో సమానంగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూళ్లలో చేరుతున్నారు. గతంలో డ్రైవింగ్ స్కూళ్లకు నెలకు 4 నుంచి 5 గురు మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడమే గగనం. కాని ఇప్పుడు నెలకు 50 నుంచి 80 మంది వరకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారని డ్రైవింగ్ స్కూళ్ల యజమానులు చెబుతున్నారు.
కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. రవాణా వ్యవస్థపై ఆధారపడకుండా సొంత వెహికిల్లో ప్రయాణించడానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. అందుకే.. ఈ కరోనా సమయంలో కూడా చాలా కొత్త కార్లు కొన్నారు. వాహనాల అమ్మకాలు బాగానే సాగాయి. ఇదే కారణం. మహిళల్లో కూడా డ్రైవింగ్ పట్ల మక్కువ పెరిగింది. ఎవరి మీదనో ఆధారపడే బదులు .. ఓ వాహనం తమ వెంట ఉంటే.. అది నడపడం వస్తే.. ఎంచక్కా.. మన పనులు మనం చేసుకోవచ్చు కదా..! అని అనుకుంటున్నారు. అనుకున్నదే తడువు.. కొందరు డ్రైవింగ్ నేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. రోడ్డుపై రయ్యిన తమ సొంత బండ్లు నడుపుతూ మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడీ సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా.