పెట్రోలు ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్న తరుణంలో మళ్లీ ఎలక్ట్రికల్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఒకసారి ఈ ప్రయోగం జరిగినా సక్సెస్ కాలేదు. ఇప్పుడు పెట్రోల్ ధరలు అదుపులో లేకుండా పోయాయి. మున్ముందు ఇంకా ఎంత వరకు పెరుగుతాయో తెలియదు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రికల్ బైకుల వైపు వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. రూ. 70 వేల ఖర్చుతో ఓ బైక్ను తీసుకుంటే పెట్రోల్ ఖర్చు లేకుండా నడుపొచ్చనే భావనలో చాలా మంది ఉన్నారు. సైకిల్ మాదిరిగానే దీనికి లైసెన్స్ అవసరం లేదు. దీంతో మైనర్లు కూడా నడిపించే అవకాశం ఉంది. ఇది కొంత రోడ్ల పై ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది.

రోజుకు రెండు గంటలు చార్జింగ్ పెడితే 75 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది. గంటకు 45 కి.మీ వేగానికి మించి అవకాశం లేదు. సింగిల్ రైడ్తో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. డబుల్ రైడ్ కొంచెం మెల్లగా వెళ్తుంది. హైదరాబాద్తో సహా జిల్లాల్లో కూడా ఏజెన్సీలు ఏర్పాటవుతున్నాయి. పెట్రోల్ బండ్లు నడిపి నడిపి జేబుకు చిల్లులు పడ్డ వారంతా ఈ బైక్ల వైపు చూస్తున్నారు. అయితే లాంగ్ డ్రైవ్ కొంత రిస్కే. లోకల్లో హాయిగా పనులు చేసుకోవచ్చు.
