టోక్యో 2020 ఒలింపిక్స్లో భారత పతకాల వేట మొదలైంది. తక్కువ అంచనాల నడుమే బరిలోకి దిగినప్పటికీ.. సైఖోమ్ మీరాబాయి చాను(26) సిల్వర్ మెడల్తో మెరిసింది. యావత్ దేశంతో ‘శెభాష్’ అనిపించుకున్నది. 1994, ఆగష్టు 8న మణిపూర్ రాజధాని ఇంపాల్ దగ్గర్లోకి నాంగ్పోక్ కక్చింగ్లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిందామె. వంట కోసం కట్టెలు తెచ్చేందుకు వెళ్లిన టైంలో తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసి అందరినీ ఆశ్చర్యపరిచింది మీరాబాయి. అలా చిన్న వయసులోనే ఆమెలోని సామర్థ్యాన్ని గుర్తించింది కుటుంబం. అటుపై కష్టమైనా సరే శిక్షణ ఇప్పించింది.
పడిలేచిన కెరటం…
2016లో రియో ఒలింపిక్స్లో పతకం కోసం పోటీ పడినప్పటికీ.. ఫెయిల్ అయ్యింది. తిరిగి పుంజుకుని 2017లో ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి.. రెండు దశాబ్దాల తర్వాత ఆ ఫీట్ను సాధించిన ఇండియన్ వెయిట్లిఫ్టర్గా నిలిచింది. ఇది ఆమె కెరీర్లో ఓ మైలురాయి అనుకోవచ్చు. 2018 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, 2019లో ఏషియన్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో కాంస్యంతో మెప్పించిన ఆమె.. అయితే 2019 వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో మాత్రం నాలుగో పొజిషన్తో సరిపెట్టుకుంది. ఆపై 2020లో సీనియర్ నేషనల్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో తన రికార్డును తానే బద్ధలు కొట్టి స్వర్ణంతో మెరుగైన ఫలితంలో ఒలింపిక్స్లో అడుగుపెట్టింది మీరాబాయి చాను.
