మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కె. తారక రామారావు తీవ్రంగా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కణమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పైన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని, 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు.
గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్ ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమేనన్నారు. తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తున్నదని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్ బదిలీపైన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ జాతీయ నాయకత్వం లో కేంద్ర ఎన్నికల కమిషన్ పని చేస్తున్నదని విమర్శించారు. మునుగోడు లో ఓటమి తప్పదు అనే బిజెపి అడ్డదారులు తొక్కుతున్నదని విమర్శించారు కేటీఆర్.