రాజ్యాంగం మార్చాలన్నాడు కేసీఆర్. ఇదేదో ఆవేశంలో అన్న మాట కాదు. ఆలోచనతోనే. చెప్పిన సందర్భం వేరు. కానీ ఆ మాట అని తేనెతుట్టేనే కదిపాడు కేసీఆర్. షరా మామూలుగా ప్రతిపక్షాలు లొల్లి చేశాయి. దళిత సంఘాలు కేసీఆర్ను దళిత వ్యతిరేకి అనే ముద్ర వేశాయి. ఆందోళనలు జరిగాయి. కొన్ని రోజులు ఇదే విషయంపై గాయి గత్తర లేపారు. కేసీఆర్ తను అన్న మాట విషయంలో కట్టుబడే ఉన్నాడు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తగ్గేదే లే అని అసలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ అంతే. చేయాల్సింది చేస్తాడు. అనాల్సింది అంటాడు. ఆ తర్వాత పట్టించుకోడు. ఇలా కొద్ది రోజులు అది వార్తయి కూర్చుంటుంది. చర్చకు తెర తీస్తుంది. కేసీఆర్ అన్న మాటలపై టీఆరెస్ నుంచి తొలత పెద్దగా స్పందన రాలేదు. కౌంటర్ ఇచ్చినా.. చోటా మోటా లీడర్లే తప్ప పేరొందిన లీడర్లు సబ్జెక్ట్ బేస్డ్గా మాట్లాడలేదు. మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ధైర్యం చేశాడు. చర్చ జరగాలన్నాడు. ఇందులో తప్పేముందన్నాడు. ఇకపై ఈ విషయంలో టీఆరెస్ దూకుడుగా వ్యవహరించనుంది. ఎదురుదాడికి దిగనుంది. అసలు మంత్రి జగదీశ్రెడ్డి ఏమన్నాడు.
——————————————-
– ప్రతిపక్షాలకు దమ్ముంటే ఇటీవల సీఎం కేసీఆర్అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
– రాజ్యంగం మీద చర్చ జరిపేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు భయ పడుతున్నాయో? అర్థం కావడం లేదు. ఆ రెండు జాతీయ పార్టీలవి అనవసరపు రాద్ధంతాలు. బీజేపీ, కాంగ్రెస్ హాయంలో నే ఇప్పటికే 120 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయి.
– ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా కొన్ని సవరణలు చేయడం అవసరమే.
– రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. ఇలాంటి పరిస్థితుల్లో నే దేశ ప్రగతి కోసం కొత్త రాజ్యాంగం అనే పదాన్ని కేసీఆర్ తెర పైకి తెచ్చాడు.
– సీఎం కేసీఆర్ మనసులో దీనికి సంబంధించిన స్పష్టమైన అవగాహన ఉంది. జ్ఞానం ఉన్న వ్యక్తులకు కేసీఆర్ ఎందుకు ఆ వాక్యాలు చేశారనేది అర్థం అవుతుంది.