కరోనాతో చాలా మంది బతుకు పాఠాలు నేర్చుకున్నారు. బతకడం ఎలాగో తెలుసుకున్నారు. అసలు జీవితం అంటే ఏమిటో కూడా కడకు అర్థం చేసుకోగలిగారు. ఓహో ఇదా జీవితం అని కుటుంబంతో కలిసి బతికినప్పుడు .. ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు అవగతం చేసుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా… ఈ జీతం కోసం పడే కష్టం.. పని ఒత్తిడి.. ఉరుకుల పరుగుల జీవింత.. ఇదేం జీవితం రా బాబూ అనే పరమార్థాన్ని కూడా తెలుసుకోగలిగారు.
అప్పటికే చాలా కంపెనీలు జీతాల భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను ఎడాపెడా తీసేశాయి. ఉన్నవాళ్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయి. తక్కువ జీతాలు ఇచ్చి బెదిరించి మరీ పనిచేయించకుంటున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఉద్యోగాలు మాకు అవసరమా? మా జీవితాలు.. కుటుంబాల సంక్షేమాన్ని మరిచి, ఆరోగ్యాన్ని విస్మరించి మీకు వెట్టి చాకిరీ చేయడం ఎంకెన్నాళ్లు..? ఇప్పుడు ఉద్యోగుల్లో వచ్చిన కొత్త ఆలోచన ఇదే. కొత్త విప్లవానికి నాంది పలికిన కారణాలు ఇవే. ది గ్రేట్ రిజిగ్నేషన్ పేరుతో అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వేల కంపెనీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు.
మీ పని వద్దూ.. మీ జీతాలూ వద్దురా బాబు.. మమ్మల్నిలా వదిలేయండి.. ఏదో ఒకటి చేసుకుని బతుకుతాం.. పెండ్లాం పిల్లలతో సంతోషంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండి.. ఎక్కువ రోజులు బతుకుతాం.. అని రాజీనామాలు ముఖం మీద పడేసి పోతున్నారట. ఇది అంతటా విస్తరిస్తున్న ఉద్యమంలా మారింది. ఒకప్పుడు ఉద్యోగం అంటే సెక్యూరిటీ. అది ప్రైవేటుది అయినా సరే. అదుంటేనే బతుకు. పెండ్లి, సంసారం.. అన్నీ. ఉద్యోగం పురుష లక్షణం అనే నానుడీ ఉంది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కరోనా పరిస్థితులను మార్చేసింది. వాస్తవాలను ముంగిట ఉంచింది. బతుకుతారా? బానిసలుగా చస్తారా? కుటుంబాలను ఆగం చేసుకుని మధ్యలోనే జీవితాలను పణంగా పెడ్తారా? తేల్చుకోండని ఓ హద్దు రేఖ గీసి వెళ్లింది. ఆ రేఖను మీరు అటు వైపా..? ఇటు వైపా.. ? తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.