(దండుగుల శ్రీనివాస్)
చేతులు కాలాక ఆకులు పట్టుకునే పని షురూ చేశాడు కేసీఆర్. ఇది ఆర్మూర్ నుంచి మొదలైంది. ఇచ్చిన వారికే టికెట్లు.. మళ్లీ మళ్లీ ఇచ్చి ఇచ్చీ… జనాలు చీదరించుకున్నా నన్ను చూసి ఓటేస్తారని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. చాలా చోట్ల సిట్టింగుల అరాచకాలు భరించలేకే తుక్కు తుక్కు కింద ఓడగొట్టారు జనం. అయినా కేసీఆర్ మారలేదు. వారినే ఇంచార్జిలుగా పెట్టుకున్నాడు. కానీ పదేండ్లు ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకుని వేల కోట్లు కూడబెట్టుకున్న మాజీలు.. జనాలపై కక్ష పెంచుకుని వారికి దూరంగానే ఉంటున్నారు. హైదరాబాద్లోనే గడుపుతున్నారు. తన ఓటమికి ప్రధానమైన కారణాల్లో ఈ సిట్టింగులకు మూడేసి సార్లు టికెట్లు ఇవ్వడమేనని గుర్తించిన కేసీఆర్ .. ఆ లోపాన్ని సరిదిద్దుకునే పనిలో పడ్డాడు.
ఆర్మూర్ నుంచి దీన్ని మొదలు పెట్టాడు. అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న్ ఆశన్నగారి జీవన్రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు అతడికి చెక్పెట్టి .. సీనియర్ దివంగత నాయకుడు ఆలూరు గంగారెడ్డి కూతురు విజయభారతికి చాన్స్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఆమెకు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈనెల 25న ఆమె తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పెద్ద ఎత్తున తన క్యాడర్, అభిమానులు, అనుచరగణంతో బీఆరెస్లో చేరుతున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లోని ఇంచార్జిలనూ తొలగించి కొత్త వారి అన్వేషణలో కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు.
ఎమ్మెల్యే కాలేకపోయిన ఆలూరు గంగారెడ్డి…
సీనియర్, దివంగత లీడర్ ఆలూరు గంగారెడ్డికి ఎమ్మెల్యే కావాలనే కోరిక తీరకుండానే అనారోగ్యంతో చనిపోయారు.1980లో సర్పంచుగా ఆలూరు నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. రైతు పోరాటాల ద్వారా తన ఉనికి చాటుకున్నాడు. గురుడు కాపుల ఐక్యత కోసం పాటుపడ్డారు. నాడు ఎన్టీఆర్ గంగారెడ్డి సేవలను గుర్తించి 1989 బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 1999లో కూడా మరోసారి ఆయనకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినా కాలం కలిసిరాలేదు. 2004లో టీఆరెస్లో చేరిన గంగారెడ్డి ఆరేడేండ్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.
2009లో బీఆరెస్, కాంగ్రెస్ పొత్తులో భాగంగా సురేశ్రెడ్డికి, ఆర్మూర్ నుంచి అన్నపూర్ణమ్మకు చాన్స్ ఇచ్చింది అధిష్టానం. 2014లో జీవన్రెడ్డికి ఆర్మూర్ టికెట్ ముందే అనౌన్స్ చేయడంతో ఆయన పార్టీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరాడు. ఆ తరువాత కాంగ్రెస్లో తుది శ్వాస విడిచే వరకు పనిచేశారు. గంగారెడ్డి తనయ విజయ భారతి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశీస్సులతో మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం నుంచి కౌన్సిలర్గా పోటీ చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్మూర్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. ఇప్పుడు ఇక్కడి నుంచే బీఆరెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలచి, తండ్రి కోరికను తీర్చాలనే పట్టుదలతో ఆమె మళ్లీ రాజకీయాల్లో ఆక్టివ్ అయ్యారు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451