బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై నిన్న కేటీఆర్ ఘాటుగా స్పందించాడు. ఎందుకు పాదయాత్ర చేస్తున్నావో చెప్పు అని నిలదీశాడు. ప్రజలకు మంచిగుంటే మీకు కడుపు మంటా? రాజకీయ నిరుద్యోగులు తమ పదవుల కోసమే ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ నిన్న నిప్పులు చెరిగాడు. బండి సంజయ్ పాద యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు బండి సమాధానం చెప్పాలి. ప్రజల అవసరాలేందీ? అవి టీఆరెస్తో ఎందుకు తీరలేదు.? ఇచ్చిన హామీల అమలుపై ఆయన నిలదీయగలగాలి. ప్రజలకు చేరువకావాలంటే.. వారి సమస్యలను ఆకళింపు చేసుకున్న నాయకుడిలా మాట్లాడాలి. పంచు డైలాగులతోనే నెట్టుకొస్తానంటే .. జనాల నుంచి పెద్దగా స్పందన రాకపోవచ్చు. చెప్పే మాటల్లో స్పష్టత ఉండాలి. సబ్జెక్టుపై క్లారిటీ ఉండాలి. సంక్షేమ పథకాల డొల్లతనం ఉదాహరణలతో బయటపెట్టగలగాలి. పథకాల పట్టాలెక్కకపోవడంపై ప్రజలు పడుతున్న బాధలను ఏకరువు పెట్టగలగాలి. ఈ రోజు పేపర్లకు ఇచ్చిన ప్రకటనలోనే ఏదో వెలితి కనిపించింది. పాదయాత్ర ఉద్దేశ్యం ఏమిటీ అనేది ఆ ప్రకటనలతో సూటిగా చెప్పలేకపోయారు. పొడిపొడిగా ఏదో ఓ జిల్లా పర్యటనలా ఆ ప్రకటన ఉంది. దీన్ని బట్టే తెలుస్తున్నది బండయాత్ర ఓ ప్రణాళిక ప్రకారం లేదని.
సరే, అన్ని పేపర్లకు అన్ని లక్షల యాడ్లు ఎలా ఇచ్చారు బండి గారు..! మీ పార్టీ ఖర్చు పెట్టదు కదా. ఓహో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే కొంత ఖర్చు పెట్టాల్సిందేనని డిసైడ్ అయ్యారు. ప్రచారార్బాటంలో మీరు ఓ అడుగేశారన్నమాట.
