బోధన్ ఎమ్మెల్యే షకీల్ గత కొంత కాలంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ పై కినుక వహించి ఉన్నాడు. తన తండ్రి అకాల మరణం చెందితే సీఎం పరామర్శకు రాలేదనే అసంతృప్తితో ఉన్నాడు. కనీసం కేటీఆర్ కూడా రాకపోవడంతో అలక పానుపెక్కాడు. నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. నాయకులే హైదరాబాద్ వెళ్లి కలిసి వస్తున్నారు తప్ప అతను మాత్రం నియోజకవర్గానికి రావడం లేదు. వ్యాపారాలకే పరిమితమయ్యాడు. పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
ఇటీవల తన సన్నిహితులతో.. ‘టీఆరెస్ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే’ అని కామెంట్ చేసిన విషయాలు బయటకు వచ్చాయి. వీటిని గ్రహించిన అధిష్టానం బుజ్జగింపు చర్యలకు దిగింది. రేపు ఢిల్లీలో టీఆరెస్ పార్టీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వెళ్తున్నాడు. ఒక రోజు ముందుగానే జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్, ముజీబుద్దీన్ తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంట షకీల్ను కూడా తీసుకువెళ్లాడు. తన వెంట తిప్పుకున్నాడు. ఈ రోజు కేటీఆర్తో, రేపు కేసీఆర్తో షకీల్ను కలిపించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ‘మచ్చిక మంత్రా’న్ని ఉపయోగిస్తున్నారు.