(దండుగుల శ్రీ‌నివాస్‌)

పాపం .. కడియం శ్రీ‌హ‌రి. అధికారం కోసం పోయి ఉన్న ప‌రువు తీసుకున్నాడు. ఆ పార్టీలో త‌నకు గౌర‌వ ద‌క్కుతుంద‌ని భావిస్తే అక్క‌డ అంత సీన్ లేద‌ని తేలిపోయింది. రేవంత్‌రెడ్డి అన్నీ తానై కాపాడుతాడ‌ని అనుకున్నాడు. ఇప్పుడు రేవంత్ గొడ‌వ రేవంత్‌కున్న‌ది. వీరిని ప‌ట్టించుకునే స్థితిలో లేడు. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు ఇది పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అస‌లే బీసీ మంత్రులు లేరు అని అధిష్టానం వ‌ద్ద మొరపెట్టుకుంటున్నాడు. ఇప్పుడున్న బీసీ మంత్రులు ముగ్గురిలో ఈమె వ్య‌వ‌హారం వివాద‌స్ప‌దంగా మారింది. ఆది నుంచే ఆమె శైలి భిన్నంగా ఉంది. స‌ర్కార్‌కు, పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిలా మారింది.

ఆ దంప‌తుల చేష్ట‌లు పార్టీని డ్యామేజీ కూడా చేస్తున్నాయి. పాపం.. మ‌హేశ్ కూడా ఎన్నిసార్లు కాపాడుకుంటాడు..? స‌ర్దిచెబుతున్నాడు. స‌ల‌హాలిస్తున్నాడు. మంద‌లిస్తున్నాడు. కానీ విన‌డం లేదు. ఆమె. ఆమెకు మంత్రి ప‌ద‌వి కాన్న లోక‌ల్ పాలిటిక్సే ఎక్కువ‌య్యాయి. క‌డియం వ్య‌వ‌హారంలో ఇది మ‌రీ ర‌చ్చకెక్కింది. వ‌రంగ‌ల్ కాంగ్రెస్ చేస్తున్న ర‌చ్చ‌.. రాష్ట్ర వ్యాప్తంగా కారుచిచ్చులా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే డిస్క‌ష‌న్‌. మంత్రి ప‌ద‌వి ఉంటుందా..? ఊడుతుందా..? అని. కానీ మంత్రి ప‌ద‌వి తీసేయ‌రు.

ఆమె కోటా ఆమె బ‌లంగా ఉంది. ఓ వైపు ప‌ద్మ‌శాలి, మ‌రోవైపు మున్నూరుకాపు .. ఈ రెండు బీసీ కార్డులు ఆమెకు బ‌లంగా ప‌నిచేస్తున్నాయి. ఆమె మ‌రింత రెచ్చిపోయి మాట్లాడే తీరు మాత్రం పార్టీకి సంక‌టంగా మారింది. రేవంత్‌, మ‌హేశ్ ఆమెకు స‌ర్దిచెప్ప‌లేక‌, కాపాడుకోలేక స‌త‌మ‌త‌మై తండ్లాడుతున్నారు.