…అవునవును! అక్కడ ఉగ్రదాడి జరగగానే ఇక్కడ సెక్యులర్లు స్వీట్లు పంచుకోవడం ఈయన చూశారు కాబోలు? మద్దతుగా ర్యాలీలు తీయడం ఈయన దృష్టికి వచ్చింది కాబోలు? ఈ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినా, ఉల్లిపాయల ధరలు పెరిగినా, ప్రధాని ఇంట్లో పిల్లి కాలికి దెబ్బ తగిలినా, సీఎం ఇంటి పెరట్లో కాకి రెట్ట‌ వేసినా.. అన్నింటికీ సెక్యులర్లు.. సారీ ‘కుహనా’ సెక్యులర్లు మాత్రమే కారణం. దేశం ఇలా వెనకబడటానికి, జీఎస్టీలు పెరగడానికి, గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడానికి.. అన్నింటికీ సెక్యులర్లు.. సారీ ‘కుహనా’ సెక్యులర్లు మాత్రమే కారణం. అంతేనా?

జరిగిన ఘటనలో చనిపోయినవారి పట్ల సానుభూతి, జరిగిన ఘటన పట్ల ఆక్రోశం కన్నా, సెక్యులర్లు.. సారీ ‘కుహనా’ సెక్యులర్ల మీద దుమ్మెత్తి పోయడం చాలా అవసరం అని అనిపించడం విశేషం, విషాదం. అందుకే మొదటి లైన్‌లోనే చాలా స్పష్టంగా రాశారు, ఉగ్రదాడులకు సెక్యులర్లు.. సారీ ‘కుహనా’ సెక్యులర్లు మద్దతు ఇస్తారని. అనాలనుకున్నది మొత్తం సెక్యులర్లనే, కానీ మళ్లీ ఏడ్చి చస్తారని సేఫ్ సైడ్‌లో ‘కుహనా’ అనే పదం వాడారు. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు, భద్రతా వైఫల్యాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, ఇన్నాళ్ల తర్వాత ఉగ్రదాడికి కారణాలు, తర్వాత చర్యలు, ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన పథకాలు.. వీటి గురించి ఆలోచన, విశ్లేషణ వద్దు. రండి..రాళ్లు తీసుకెళ్లి సెక్యులర్ల మీద వేద్దాం. అంతే!

దేశంలో అన్ని మతాలు సమానం అని, రాజ్యసంబంధ విషయాల్లో మతం జోక్యం ఉండకూడదని కదా ‘సెక్యులరిజం’ అసలు అర్థం. దాన్ని ఎంచక్కా ‘ముస్లింలకు అనుకూలమైనది సెక్యులరిజం’, ‘క్రిస్టియన్లకు దోచిపెట్టేది సెక్యులరిజం’, ‘రిజర్వేషన్లను ప్రోత్సహించేది సెక్యులరిజం’ అని ట్విస్ట్ చేసి సొంత అర్థాలు కల్పించుకుంటున్నారు. మతం అడిగి మనుషుల్ని చంపింది కశ్మీర్‌లో కాబట్టి ఇంత ఆగ్రహం. ఈ ఘటన దేశమంతటికీ బాధే. ఎవరూ కాదనం. కానీ నాయనలారా.. ప్యాంట్లు విప్పి శిశ్నం ఉందా లేదా అని చూసి, చేతిలో మాంసం ప్యాకెట్ చూసి, పెరిగిన గడ్డం చూసి, మతం అడిగి మరీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో ఎవరు ఎవరిని చంపారో తెలియదా? అప్పుడు మాత్రం వీళ్లెవరూ గట్టిగా ఖండించలేదే?

‘రాజ్యాంగంలో ‘లౌకికవాదం’ అనే పదమే లేదు. దాన్ని తర్వాత చేర్చారు’ అని కొందరు మహానుభావుల వాదన. వాళ్లకి దండం పెట్టాలి. రాజ్యాంగంలో చాలా లేవు. ఆ తర్వాత చాలాసార్లు దాన్ని సవరించి, కొత్త కొత్తవి అందులో చేర్చాం. వాటిని ఒప్పుకునే మీరు, దీన్ని ఒప్పుకోరా? ‘సమానత్వ హక్కు’, ‘మతస్వేచ్ఛ హక్కు’ అనేవి లౌకికవాదంలో అంతర్భాగం కాబట్టే విడిగా దానికో పదం కేటాయించలేదనే కనీస విషయం తెలియదా? మరి ఈ దేశం నిండా కుప్పలు కుప్పలు హిందువులు ఉన్న కాలంలోనే ముస్లిం రాజులు దండయాత్రలు చేస్తే ఏం చేయగలిగాం? దేశం నిండా హిందువులే ఉన్న కాలంలో బ్రిటిష్ కంపెనీ వస్తే ఏం ఆపగలిగాం? ఆ రోజు ఆపలేనివాళ్లం, అడ్డుకోలేనివాళ్లం ఇవాళ మాత్రం మీసాలు మెలేసి మా చరిత్ర ఇంత ఘనమైనది చూడండహో అని సినిమాలు తీస్తూ డప్పులు కొడుతున్నాం.

కులీకుతుబ్‌షాని కందుకూరి రుద్రకవి ‘మల్కిభ రాముడు’ అని పొగిడినప్పుడు ఏమయ్యారు అందరు హిందువులు? తానీషా రామదాసు జైల్లో పెట్టినప్పుడు, ఆ తర్వాత విడుదల చేసి జీతం ఇచ్చి పోషించినప్పుడు ఏమయ్యారు అందరు హిందువులు? ఆర్థర్ కాటన్ గోదావరి ఆనకట్ట కట్టినప్పుడు, బ్రౌన్ నిఘంటువు రాసినప్పుడు, తాతాచార్యుల కథలు ప్రచురించినప్పుడు, మన్రో తిరుపతి వేంకటేశ్వరునికి గంగాళం వితరణగా ఇచ్చినప్పుడు, నిజాం మూసీ నది ఒడ్డున నిలబడి చీరసారె సమర్పించినప్పుడు, బిస్మిల్లాఖాన్ కాశీ విశ్వనాథుడి కోసం షెహనాయ్ వాయించినప్పుడు..అంతా బాగానే ఉందిగా! అందరూ కలిసిమెలిసే జీవించారుగా! అదే కదా లౌకికవాదం. ఇప్పుడు మాత్రం దాన్ని వదిలేసుకోవాలా? లౌకికవాదం పోతే ఈ దేశంలో ఇంటింటికి ఓ బంగారు ఇటుక, ఓ వజ్రాల హారం ఇస్తారా? చూస్తున్నాంగా, ఎంత గొప్పగా ఇస్తున్నారో మన నేతలు. మీరూ.. మీ బూజు ఆలోచనలు.

ఉగ్రవాదానికి ఒక్క మతమే టార్గెట్ అంట. అంటే నిండా ముస్లింలున్న అప్ఘానిస్థాన్ ఇప్పుడు భూతల స్వర్గంలా ఉందా? ఉగ్రవాదుల పాలనలో ఉండలేక, భయం పట్టి వలసపోతున్న అప్ఘానిస్థాన్ ప్రజల ఆక్రందన కనిపించడం లేదా? అక్కడ సొంత మతం వాళ్లని ఏం రక్షించింది? మతం ఎక్కడున్నా, చివరకు జరిగేది ఉన్మాదమే. ఉగ్రవాదానికి ఉన్మాదం తప్ప మతం లేదని, మతాన్ని నమ్మినవాడు ఇతరుల్ని చంపి, తాను చావడానికే సిద్ధపడతాడని తెలుసుకోక, ఇలా సెక్యులర్ల మీద పడి ఏడిస్తే ఏమిటి లాభం? ఎనీవే.. బట్టతల ఉన్నవాళ్లంతా బాపురమణలు కాదు. జర్నలిస్టులని చెప్పుకునేవారంతా గొప్పవారూ కాదు. సత్యం.

– విశీ(వి.సాయివంశీ) ✍️✍️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed