(దండుగుల శ్రీనివాస్)
ఈ మధ్య టాలీవుడ్ తీవ్ర విమర్శల పాలవుతున్నది. బుద్ది, జ్ఞానం లేకుండా సోయి సొక్కు లేకుండా మైకు చేతికందితే చాలు ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఆ తరువాత నాలుక్కర్చుకుంటున్నారు. అవును.. నేను మాట్లాడింది తప్పే అని తప్పొప్పుకుని చెంపలేసుకుని ముక్కు నేలకు రాసినంత పనిచేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులోకి మన చిరు కూడా వచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే చిరు మంచి వక్త కాదు. రాజకీయంగా రంగ ప్రవేశం చేసి కాళ్లు వేళ్లూ ఒళ్లూ కాల్చుకుని బతుకు జీవుడా అని బయటపడ్డా.. ఇంకా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. ఏదో స్వగతంలో మాట్లాడేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా బ్రహ్మానందం అతని కుమారుడితో తీసిన మూవీ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరై ఏదో మాట్లాడాడు.
అదిప్పుడు చిరును చెడామడా తిట్టే స్థాయి వరకు వెళ్లింది. అతగాడేమన్నాడంటే.. తనుండే ఇళ్లు లేడీస్ హాస్టల్లా ఉంటుందన్నాడు. తనో వార్డెన్గా ఫీలవుతానన్నాడు. అంత వరకు బాగానే ఉంది. కానీ రామ్ చరణ్ ఇక అబ్బాయినే కనాలి.. తన లెగసీ కొనసాగించాలి కదా అని నోరు జారాడు. తనకు షరా మమూలైన విషయమే కదా. ఇక్కడే లొల్లి మొదలైంది. అంటే అమ్మాయిలు పేరు, వారసత్వాన్ని కొనసాగించలేరా..? మహిళలు కొన్ని చానెళ్లు, సోషల్ మీడియా ఒంటికాలిపై లేచింది. అంతకు ముందు అర్వింద్, ఆ ముందు దిల్రాజు, ఆ మధ్యలో ఓ డైరెక్టర్ , పుష్ప అల్లు అర్జున్ సీఎం పేరు మరిచి ఏదో రచ్చ చేసి జైలు పాలయ్యాడు. యాంకర్ శ్రీముఖి ఇలా వరుసబెట్టి అంతా వివాదస్పమయ్యారు.
వైలర్గా మారారు. నాలుక్కర్చుకున్నారు. మళ్లీ క్షమాపణలు కోరుతూ ఏవో వీడియోలు పోస్టింగులు చేశారు. ఎంత చేసినా మనవాళ్లకు నోటిదూల మామూలుగా లేదని మాత్రం అర్ధమయిపోయింది. నలుగురు దోస్తులు కలిసి సిట్టింగు వేసుకుని తప్పతాగి ఒళ్లు మరిచి మట్లాడినట్టే ఉంటుంది వీరి వైఖరి. మైకు చేతికొస్తే చాలు మైకం కమ్మేస్తుంది. ఏం మాట్లాడుతారో తెలియదు. బాలక్రిష్ణ, మోహన్బాబుల గురించి చెప్పాలంటే చాలనే ఉంది. నాగార్జున కొంచెం బెటర్. ఇప్పుడు చిరు కూడా బజారుకెక్కాడు. వాస్తవంగా చాలా సందర్భాల్లో చిరుకు మాట్లాడటం సరిగా రాక నాలుక్కర్చుకునే సంబాషణలు ఎన్నో చేశాడు. ఇప్పుడు ఇలా దొరికాడు. ఆడుకుంటున్నారు.