(దండుగుల శ్రీ‌నివాస్‌)

మంత్రి తుమ్మ‌ల నోటిదూల, అనాలోచిత ప్ర‌క‌ట‌నలు ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఇర‌కాటంలో పెట్టాయి. రైతుల్లో గంద‌ర‌గోళాన్ని నింపాయి. ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రాన్ని అందించాయి. రైతుపండుగ పేరుతో కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టి మూడు రోజుల కార్య‌క్ర‌మంచేసి బోన‌స్ ఇస్తే చాలు.. రైతు భ‌రోసా ఇవ్వ‌కున్నా ప‌ర్లేదు.. అన్న విధంగా మంత్రి చేసిన కామెంట్లు రైతులకు స‌ర్కార్‌కు మ‌ధ్య అంత‌రం పెంచాయి. దీనిపై సీఎం రేవంత్ స్వ‌యంగా రంగంలోకి దిగాడు. ఇవాళ ఆయ‌న ప్రెస్‌మీట్ పెట్టి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతి త‌రువాత రైతు భ‌రోసా ఇస్తామ‌ని హామీ ఇచ్చాడు. ఇన్ని రోజుల త‌రువాత సీఎం నోటి వెంట రైతు భ‌రోసా మాట వెళ్లింది.

అంత‌కు ముందే మీడియాకు ప్ర‌భుత్వ పెద్ద‌లు లీక్ చేసి ఉన్నారు. క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. సంక్రాంతి త‌రువాత రైతు భ‌రోసా అని. ఈలోపు మంత్రి తుమ్మ‌ల కామెంట్లు పెంట పెంట చేసి పెట్టాయి. దీన్ని చ‌క్కిదిద్దేందుకు స్వ‌యంగా సీఎం రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. రైతు భ‌రోసా ఇస్తాం… బీఆరెస్ నేత‌ల మాట‌లు వినొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రైతు రుణ‌మాఫీ సంపూర్ణ‌మైంద‌న్నారు. 25 ల‌క్ష‌ల మంది రైతుల‌కు, 21వేల కోట్లు రుణ‌మాఫీ చేశామ‌ని వివ‌రించారు. బీఆరెస్ ప‌దేళ్ల‌లో మొత్తం 11వేల కోట్ల మేర రుణ‌మాఫీ చేసినా.. అందులో మిత్తీల కింద‌కే 8 వేల కోట్లు పోయాయ‌ని, అంటే నిజంగా ఆ ప్ర‌భుత్వం రుణ‌మాఫీ చేసింది కేవ‌లం 3వేల కోట్లేన‌న్నారు.

గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాల హ‌యాంలో కూడా ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఇంత పెద్ద మొత్తంలో రుణ‌మాఫీ చేయ‌లేద‌ని చెప్పాడు సీఎం. దేశంలోనే ఇది చ‌రిత్ర సృష్టించింద‌న్నాడు.

You missed