దండుగుల శ్రీనివాస్ – వాస్తవం చీఫ్ బ్యూరో:
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కాడు. తాజాగా ఆయన సీఎం రేవంత్కు ఓ లేఖ రాశాడు. అదేమంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నానని. ఎవరి కోసం..? ఎందుకోసం..? ఆర్మూర్కు నిధులివ్వకుండావ పక్కదారి పట్టించినందుకు. సీఎం రేవంత్రెడ్డి మాటిచ్చి తప్పినందుకు. ఏం నిధులు..? ఎందుకోసం..? ఎవరి కోసం..?? ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ భవనాల నిర్మాణాల కోసం. రూ. 150 కోట్ల కోసం. ఆర్మూర్కు దక్కాల్సిన ఈ నిధులు వేరే చోటికి పంపినందుకు. ఎక్కడికి పంపారు..? ఎవరికిచ్చారు..?? ఆర్మూర్కు కేటాయించాల్సిన ఈ నిధులు మధిర ( భట్టి విక్రమార్క నియోజకవర్గం)కు పంపారు.
మాటిచ్చి తప్పినందుకు. ఎవరు మాటిచ్చారు..? ఎప్పుడిచ్చారు.?? సీఎం రేవంత్రెడ్డి మాటిచ్చాడు. అసెంబ్లీ ఆవరణలో ఆయనను రాకేశ్రెడ్డి కలిసినప్పుడు. మరి ఎందుకు ఇవ్వలేదు. మొదటిది తన నియోజకవర్గం కొడంగల్కు కేటాయించుకున్నాడు. ఇప్పుడు రెండోది మధిరకు..అంటే రెండూ దక్షిణ తెలంగాణకే అనేది ఎమ్మెల్యే ఆరోపణ. అందుకే ఈ నిరాహారదీక్ష. వారం డెడ్ లైన్. స్పందించకపోతే ఆమరణ దీక్ష. ఇదీ సీఎం రేవంత్కు రాకేశ్రెడ్డి పంపిన లేఖ సారాంశం.