దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కేసీఆర్‌కు మండింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై లేఖాస్త్రం ప్రయోగించాడు. నలుగురు మాజీ ఎమ్మెల్యేల పేరుతో ఆ లేఖ విడుదలైంది. పోచారం పార్టీ మారిన నాలుగు రోజుల తరువాత ఈ లేఖ విడుదల కావడం చర్చకు దారి తీసింది. బాజిరెడ్డి గోవర్దన్, గంప గోవర్దన్‌, హన్మంత్‌ షిండే, సురేందర్‌ల సంతకాలతో ఈ లేఖ విడుదలైంది. ఎంతో అత్యున్నత పదవి స్పీకర్‌గా చేశాం… బాన్సువాడ అభివృద్ధికి ఎవరికీ ఇవ్వనన్ని నిధులిచ్చాం.. అయినా పార్టీని, కేసీఆర్‌ను, చివరకు బాన్సువాడ ప్రజలను కూడా మోసం చేసి పార్టీ మారావ్‌.. నీ కుటుంబాన్ని బాన్సవాడ ప్రజలు ఎన్నటికీ క్షమించరని తిట్టిపోస్తూ ఆ లేఖలో ఉంది.

కార్యకర్తలకు మేము అండగా ఉన్నామని మనోధైర్యాన్నిచ్చారు ఈ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు. పోచారం చేరిన నాలుగు రోజులు తరువాత ఈ లేఖ రావడం వెనుక కేసీఆర్‌ ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆయన పోచారం పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అతను పార్టీ నుంచి వెళ్లిపోతాడని అస్సలే ఊహించలేదు. ఈ పరిణామాల నడుమ ఆయన త్వరగా కోలుకోలేకపోయాడు.

మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అమెరికా నుంచి పోచారంపై దుమ్మెత్తిపోసినా… బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తాలు ప్రెస్‌మీట్ పెట్టినా.. అవన్నీ ఒకెత్తయితే ఈ లేఖ మరీ ఘాటుగా ఉంది. ఇందులో పోచారం ఫ్యామిలీనే శాపనార్ధాలు పెడుతూ వచ్చింది. మీ కుటుంబాన్ని ప్రజలెప్పుడూ క్షమించరు అంటూ ఇది పోచారం రాజకీయ జీవితంలో చేసిన దిద్దుకోలేని తప్పు, పాపం అనే రీతిలో ఆ లేఖ సారాంశం ఉంది.