దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్రం బీఆరెస్తో ఆడుకుంటోంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సీబీ’ఐ’ నిఘా వేసింది. నోటీసుల పేరుతో ఆమెను రప్పించి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. పరిస్థితి గమనించిన కవిత.. సోమవారం హాజరుకావాల్సి ఉండగా.. ఆదివారం సాయంత్రం సీబీఐకి లేఖ రాసింది. తాను హాజరుకావడం లేదన్నది. పార్లమెంటు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నాయని తేల్చి చెప్పింది. తాను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడం లేదనే విషయాన్ని కూడా పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. ప్రచారానికే పరిమితమవుతున్నట్టు చెప్పేసింది. కావాలంటే వర్చువల్ ఎంక్వైరీకి హాజరవుతానన్నది. ఫిజికల్గా హాజరైతే అరెస్టు తప్పదనే సంకేతాలు ఆమెకున్నాయి.
లీగల్ ఓపినియన్ మేరకే ఈ లేఖాస్త్రాన్ని సంధించింది కవిత. గతంలో మాదిరిగా తాను బిజీగా ఉన్నానని, తన ఇంటికే వచ్చి విచారణ జరుపుకోవాలని ఆమె ఈసారి ఆప్షన్ ఇవ్వలేకపోయింది. కారణం.. ఇక్కడికొచ్చినా అరెస్టు తప్పదనే విషయం తెలుసు. కనీసం పార్టీ నుంచి ఎలాంటి స్పందనలు లేకపోవడం.. రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ కేసులో కవితకు సానుభూతి లేకుండా పోవడం బీఆరెస్కు మరింత మైనస్ అయ్యింది. ఈ సమయంలో మోడీ అదును చూసి దెబ్బ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. సీబీఐ దీనిపై ఏం స్పందిస్తుందోననే ఉత్కంఠ నెలకొన్నది. ఇంటికే వస్తామనే రిప్లై రావొచ్చని భావిస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికల కోడ్ పడితే ఇక ఈ కేసు విచారణ విషయం అటకెక్కినట్టే. ఆ లోపే దీనికి ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే.. బీజేపీ, బీఆరెస్ల దాగుడు మూతల దండాకోర్గా ఈ కేసు మిగిలిపోనుంది.