దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
పాపం.. కాంట్రాక్టర్లు. అసలే అరకొర నిధులు. సమయానికి రాని బిల్లులు. అప్పుల పాలు చేసిన కేసీఆర్. ఇవన్నీ చాలవని ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది వారికి. చాలా చోట్ల సిట్టింగులు ఓడారు. కొత్త వారు గెలిచారు. ఎన్నికల సమయంలో సిట్టింగులు కాంట్రాక్టర్ల వద్ద ముక్కు పిండి వసూళ్లు చేశారు. ‘ అరే మళ్లీ మనమే వస్తున్నాం రా బై.. ఎన్నికల కోసం ఖర్చులకు పంపు.. మళ్లీ నిన్ను చూసుకుంటా గానీ..’ అంటూ బెదిరించి, బుజ్జగించి ఎలాగోలా లక్షలు గుంజారు. సరే తప్పుదు. ఆ నియోజకవర్గంలో పనులు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు రావాల్సి ఉంది. మిగిలిన పనులు చేస్తే ఆ బిల్లులకు ఆటకం లేకుండా ఉంటుంది. ఒకవేళ.. కొంపదీసి మళ్లీ ఈ మహాత్ముడే వస్తే.. వామ్మో ఇంకేమన్నా ఉందా.. రాచిరంపాన పెట్టి నరకం చూపి తనకు తాను ఉరేసుకోని చచ్చిపోయేలా చేస్తాడు. ఎందుకొచ్చిన గొడవ. ముందే కేసీఆర్ జమానా ఇది. అని అనుకుని జేబులు ఖాళీ చేసుకుని.. ఆడనో ఈడనో అడిగి ఇచ్చేశారు. తీరా చూస్తే సిట్టింగులు ఘోరంగా ఓడిపోయారు.
అప్పటికే పది శాతం, ఇరవై శాతం .. ఎన్నికల పేరుతో ఇంకా అదనంగా కమీషన్లు సమర్పించుకున్నారు. ఇప్పుడు కొత్తోడు వచ్చిండు. మళ్లీ కమీషన్లు కావాలంటుండు. ఎలా..? వామ్మో ఈ పనులు చేసే బదులు చాలించుకుంది మేలు. మావళ్ల కాదు మహాప్రభో అని… చేతులెత్తేశారు. ఇక మేం ఈ పనులు చేయబోమన్నారు. అరేయ్ రండ్రా.. మేము కొత్తగా వచ్చాం… అన్ని చూసుకుంటాం.. అని నచ్చజెప్పినా.. మేం మళ్లీ మీకు కమీషన్లు సమర్పించుకునే స్థితిలో లేము మహాప్రభో మమ్మలెదలండి అని కాంట్రాక్ట్ పనులకు హాలిడే ప్రకటించేశారు. పనులన్నీ బంద్. అభివృద్ధి ఇప్పుడు పురోగతిలో కాదు అధోగతిలోకి వెళ్లిపోయింది. బాబ్బాబ్బాబు… రండ్రి కూసోని మాట్లాడుకుందామని వరుసపెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు మీటింగులు పెడుతుండ్రు కాంట్రాక్టర్లతో. కొందరు అక్కడి నుంచి అక్కడే పారిపోతున్నారు. కొందరు బలవంతంగా నవ్వుమొకమొకటేసుకుని వచ్చి కూసోని చెప్పింది విని సరే అని నమ్మబలికి మీటింగు అయిపోగానే కాలికి బలపం కట్టుకుని తుర్రుమంటుంట్రు. మళ్లీ వస్తే చెప్పు.. మళ్లా ఫోన్ ఎత్తితే ఒట్టు..