టీయూ వీసీపై ఏసీబీకి ఫిర్యాదు…
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు కూడా… ఈసీ కీలక భేటీలో తీర్మానాలు..
ఆ ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు..
మళ్లీ టీయూ రిజిస్ట్రార్గా యాదగిరి
వివాదాల వీసీపై సర్కార్ సీరియస్… లేటుగానైనా దిద్దుబాటు చర్యలు..
తెలంగాణ యూనివర్సిటీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) కీలక భేటీ జరిగింది. దీంట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుని తీర్మానాలు చేశారు. ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం టీయూను గాడిలో పెట్డడంలో భాగంగానే ఈసీ మీటింగు, తీర్మానాలు చేయించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా వీసీ రవీందర్ గుప్తాపై ఏసీబీకి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేయాలని తీర్మానం చేశారు.
వీసీ చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలని తీర్మానం చేయడంతో పాటు ..వీసీ అనధికారికంగా నియమించుకున్న ముగ్గురు రిజిస్ట్రార్లు శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలాదేవీ లపై క్రిమినల్ కేసులకు చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతంలో నియమించిన రిజిస్ట్రార్ ఏడాది గడువు కాలం పూర్తికాకముందే అతన్ని తొలగించినందున.. మళ్లీ అతన్నే రిజిస్ట్రార్గా నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది ఈసీ. దీంతో ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈసీ మీటింగులో మారయ్య గౌడ్, నసీం, హారతి, రవీందర్ రెడ్డి, వసుంధర, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.