నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కు ఢిల్లీ లిక్క‌ర్ స్కాంతో సంబంధాలున్నాయంటూ నిన్న బీజేపీ చేసిన ఆరోప‌ణ‌లు జిల్లాలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపాయి. బీజేపీ కుట్ర రాజ‌కీయాలు చేస్తుందంటూ, ఇందులో క‌విత‌కు ఎలాంటి సంబంధాలు లేకున్నా బ‌ట్ట‌కాల్చి మీదేస్తున్నారంటూ ఇందూరు గులాబీ ద‌ళం భ‌గ్గుమ‌న్న‌ది. ఎక్క‌డిక‌క్క‌డ ఈ ఆరోప‌ణ‌లను ఖండిస్తూ బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇందూరు రాజ‌కీయంలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఈ ఉదంతంపై క‌విత స్పందించిన విష‌యం తెలిసిందే. కేసీఆర్‌ను మాన‌సికంగా దెబ్బ తీయ‌డం కోసమే బీజేపీ ఇదంతా చేస్తుంద‌ని, ఇలాంటి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని, వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఆమె అన్నారు. రాజ‌కీయంగా ఈ అంశం మ‌రింత రాజుకోనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిపై కేంద్ర బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తీవ్రంగా ఖండించారు జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు.

కేసిఆర్ కూతురని బద్నామ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది పూర్తిగా పిరికిపంద చర్యగా భావిస్తున్నానని, తెలంగాణాలో కేసీఆర్ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ఇటువంటి కార్యక్రమాలకు పూనుకుందనిఆయ‌న మండిప‌డ్డారు.

నుడా చైర్మ‌న్ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, నుడా డైరెక్ట‌ర్లు, ఇందూరు జిల్లా గౌడ సంఘం ప్ర‌తినిధులు ఎస్‌. జ‌య‌సింహా గౌడ్‌, ప‌ట్ట‌ణ మూడ‌వ గౌడ సంఘం అధ్య‌క్షుడు ఎస్ స్వామిగౌడ్ త‌దిత‌రులు క‌విత‌పై ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ ఉద్య‌మంలో త‌న‌దైన భూమిక పోషించి, తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల‌కు రోల్ మోడ‌ల్‌గా నిలిచిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు , నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పై బీజేపీ, కేంద్ర ప్ర‌భుత్వం బ‌ద్నాం రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌టం వారి దివాళాకోరు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నమ‌ని విమ‌ర్శించారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌విత‌గారి పేరు ప్ర‌స్తావించ‌డం పూర్తిగా నిరాధార‌మైన‌ద‌ని, ఇలాంటి కుట్ర‌పూరిత రాజ‌కీయాల‌కు కేంద్ర బీజేపీ కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో మోడీ ప్ర‌భుత్వం విశ్వాసం కోల్పోతూ వ‌స్తున్న‌దని, ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డి, కుట్ర రాజ‌కీయాల‌కు తెర తీస్తే పూర్తిగా ప్ర‌జ‌ల విశ్వాసం కోల్పోయి చ‌రిత్ర హీనులుగా నిలుస్తార‌ని వారు హెచ్చ‌రించారు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న ఉద్య‌మ కారుల‌కు, ప్ర‌జ‌ల‌కు క‌విత చ‌రిత్ర తెలుసున‌ని, విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేస్తూ అంద‌రికీ ఆద‌ర్శ‌కంగా ఆమె నిలుస్తున్నార‌న్నారు. క‌వితపై బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌డం, బ‌ట్ట‌కాల్చి మీదేయాల‌ని చూడటం….. సూర్యుడి మీద ఉమ్మేసిన చందమే అవుతుంద‌ని హిత‌వు ప‌లికారు. ఇలాంటి చ‌ర్య‌లు మానుకోక‌పోతే తెలంగాణ ప్ర‌జ‌లు బీజేపీకి ప్ర‌జాక్షేత్రంలో త‌గిన గుణ‌పాఠం, బుద్ది చెప్తార‌ని వార్నింగ్ ఇచ్చారు.

You missed