ఆయన హర్యానాకు సీఎం. బీజేపీ తెచ్చిన రైతు చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమంపై ఆయన స్పందించిన తీరు సిగ్గుమాలిన చర్యగా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మరింత అగాథాన్ని పెంచే విధంగా ఉంది. అవును .. కొందరు నేతలు అత్యుత్సాహంతో, అవగాహన లేమితో మాట్లాడే మాటలు .. ఆ ఒక్కడికే కాదు.. .పార్టీకి ప్రభుత్వానికి, వ్యవస్థకూ నష్టం కలిగిస్తాయి. ఇప్పుడదే జరుగుతున్నది. ఓ వైపు రైతులు రోడ్డెక్కి రక్తం చిందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వారి ప్రాణాలు తోడేస్తుంది. ఇది సరిపోదంటూ .. ఈ హర్యానా సీఎం… వాళ్లను తన్నండి.. చంపండి.. జైలుకు వెళ్తే మేం చూసుకుంటాం.. అనే రీతిలో మాట్లాడటం మన వ్యవస్థ ఎలా ఉంది తెలియజేస్తున్నది. ఈ సంఘటన నిన్న జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
బీజేపీ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడాలని, జైలుకైనా వెళ్లేందుకు సిద్ధపడాలని హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ పిలుపునివ్వడం వివాదాస్పమైంది. ఆదివారం హర్యానాలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో సీఎం ఖట్టర్ మాట్లాడారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. ‘మనం తగిన విధంగా బదులివ్వాలి. 500 లేదా 1000 మంది బీజేపీ కార్యకర్తలు ఒక్కో బృందంగా ఏర్పడాలి. జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని బాధపడకండి. పెద్ద లీడర్లు అవుతారు. చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది’ అని అన్నారు. గుంపులో ఒకరు ‘కర్రలు చేతబూనాలి’ అనడం వినిపించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఖట్టర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. రైతులపై కర్రలతో దాడికి ఖట్టర్ బీజేపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించింది.