ఆయనో గట్టుప్పలకు చెందిన బీజేపీ నేత. ప్రజాధారణ కలిగిన నాయకుడు. కేటీఆర్ నిన్న స్వయంగా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాడు. దీన్ని బీజేపీ నేతలు వైరల్ చేసి తమకు అనుకూలంగా మలుచుకుందామనుకున్నారు. కానీ ఇక్కడే కథ బెడిసికొట్టింది. ఆ ఫోన్ కాల్లో బీజేపీకి పనికొచ్చే ఒక్క అంశమూ లేదు. టీఆరెస్ను ఇరుకున పెట్టే ఒక్క మాటా లేదు. కేటీఆర్ ను తక్కువ చేసి చూపే అంశాలు మచ్చుకు కనిపించలేదు. సంక్షేమ పథకాల వివరాలు, ఆ గట్టుప్పలలో లబ్దిదారుల విషయాలు.. మున్ముందు ప్రభుత్వం చేపట్టే పథకాలు ఇవే ప్రస్తావించాడు కేటీఆర్. రాజగోపాల్ రెడ్డి తన స్వార్థానికే పార్టీ మారాడు తప్పితే అతనితో అయ్యింది లేదు.. అయ్యేదీ ఉండదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు కేటీఆర్.
అన్నింటినీ సావధానంగా విన్నాడు ఆ గట్టుప్పల బీజేపీ లీడర్. అవును అని కూడా అంగీకరిస్తూనే.. ఒక్క రైతుబంధు పథకంపైనే కొన్ని అభ్యంతరాలను కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చాడు. ఇది అందరికీ ఇవ్వొద్దని, నిజంగా వ్యవసాయం చేసుకునే వారికే ఇవ్వాలని, కౌలు రైతులకే ఇవ్వాలని విజ్జప్తి చేశాడు. కేటీఆరూ ఓపిగ్గా విన్నాడు. సరే అన్నాడు. సావధానంగా సమాధానమిచ్చాడు. సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సలహాలు పాటిస్తామన్నాడు. మొత్తంగా మీరు వస్తే పార్టీకి మరింత ఉపయోగం ఉంటుందనే విషయాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేయడమొకటే బీజేపీకి దొరికిన అస్త్రం.
ఇక దీన్నే సోషల్ మీడియాలో తిప్పీ తిప్పీ…. వైరల్ చేసి .. అది తమకు ఎంతో ఉపయోగపడుతుందని భావించారు కమలనాథులు. కానీ ఆ వీడియో విన్న ప్రతీ ఒక్కరూ దానికంత సీన్ లేదు. కేటీఆర్ మాట్లాడినదాంట్లో వేలెత్తి చూపడానికి, ప్రశ్నించడదానికి కూడా ఏమీ లేదని పెదవి విరిచారు. అంతిమంగా ఇది బీజేపీ ఎలాంటి ఉపయోగం లేకపోగా,ప్రయోజనం చేకూరకపోగా.. టీఆరెస్ మాత్రం ఎదురుదాడి చేయడానికి ఉపయోగపడ్డది. కథ రివర్స్ కావడంతో కమలనాథులు బిక్కచచ్చిపోయారు. ఇదేందిరా బై..ఎదురుతన్నించుకున్నట్టయ్యింది అని కూడా అనుకుంటున్నారట….
