అవును అదే జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. దేశానికి అన్నంపెట్టే రైతన్న నెత్తురు కండ్ల చూశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న కర్షకుల ప్రాణాలు కేంద్రమంత్రి కాన్వాయ్ చక్రాల కింద వేసి నలిపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు ప్రమాదానికి కారణమైన వాహనాలను దగ్ధం చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆందోళన చేస్తున్నరైతులకు గాయాలయ్యాయి. రణరంగాన్ని తలపించిన ఈ ఘటనలో వాహన ప్రమాదంలో 4 గురు రైతులు అసువులుబాయగా.. పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో మరో 4గురు మృతి చెందారు.
సంఘటన వివరాల్లోకి వెళితే లఖింపూర్ ఖీరీ జిల్లా తికునియాలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొన్నారు. అక్కడి నుంచి అజయ్ మిశ్రా స్వగ్రామమైన బన్బీపూర్లో వీరు పర్యటించాల్సి ఉంది. ఈ మార్గంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి వస్తున్నాడని తెలుసుకుని నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు.
అదే సమయంలో అటుగా వచ్చిన మంత్రి కాన్వాయ్ను రైతులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈక్రమంలో రైతులమీదకు మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు ప్రమాదానికి కారణమైన కారుతో పాటు మరో రెండు కార్లలో ఉన్నవారిపై దాడిచేశారు. అనంతరం ఆ వాహనాలను దగ్ధం చేశారు.
ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతర ఘర్షణల్లో మరో ఇద్దరు రైతులు మరణించారు. ఉద్రిక్తతలపై లఖింపూర్ ఖీరీ ఏఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు. కాన్వాయ్ ప్రమాదం, అనంతర ఘర్షణల్లో నలుగురు రైతులు మరణించినట్టు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కాన్వాయ్లో ప్రయాణించిన వ్యక్తులపై కొందరు దుండగులు దాడులు చేశారని, దీంతో మరో నలుగురు మరణించినట్టు వెల్లడించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో లఖింపూర్ ఖీరీలో ఇంటర్నెట్ నిలిపేశారు.