37వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవేనని బండి సంజయ్ ఆరోపించారు. తన పాదయాత్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. దీని పై టీఆర్ఎస్ సోషల్ మీడియా విరుచుకుపడుతున్నది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వాళ్లు తమ వెబ్సైట్లో గడిచిన రెండేళ్లలో దేశం మొత్తంగా చనిపోయిన రైతుల సంఖ్యను పెట్టలేదనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పెట్టి ఈ బండి పచ్చి అబద్ధాలడుతున్నట్లు ట్రోల్ చేస్తున్నారు. 2018,2019 సంవత్సరాలకు సంబంధించిన రైతుల ఆత్మహత్యల గురించే అందులో పెట్టారు. మరి ఎలా గడిచిన రెండేండ్లలో 37వేల మంది రైతులు తెలంగాణలో చనిపోయారంటూ చెబుతావు..? నీ చెవిలో ఎవరో వచ్చి చెప్పారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.
వాస్తవానికి బండి సంజయ్ ప్రభుత్వంపై చేసే చాలా వరకు ఆరోపణల్లో నిజం ఉండదు. పస ఉండదు. ఆధారాలుండవు. పంచుల కోసం ప్రాసల కోసం జనం నుంచి మంచి స్పందన వచ్చేందుకు ఇలా కొన్ని సార్లు మాట్లాడి నవ్వుల పాలవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా రైతుల ఆత్మహత్యలపై దొరికిపోయాడు. గతంలో బండి సంజయ్ ఇలాంటి ఆధారం లేని ఎన్నో ఆరోపణలు చేసినా.. టీఆరెస్ సోషల్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. కేటీఆర్ మొన్న ఈట్ కా జవాబ్ పత్తర్ సే ఇస్తామంటూ చెప్పడంతో అటు నాయకులు, ఇటు సోషల్ మీడియా వారియర్స్ ఏ ఒక్క చిన్న తప్పు దొరికినా ఆటాడేసుకుంటున్నారు. 2018లో 900 మంది రైతులు చనిపోగా, 2019లో 491 మంది చనిపోయారని ఎన్సీఆర్బీ పేర్కొన్నది. గతంతో చూస్తే ఇప్పుడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గుతున్నాయనే వాటి గణాంకాలు చెబుతున్నాయి.