వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
రాన్రాను రాజు గుర్రం గాడిదైంది. అప్పట్లో మనం అనుకున్నాం కేటీఆర్ గురించి. ఇప్పుడు అంతకు మించే అయి కూర్చున్నడాయన. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఆయన మాట్లాడిన మాటలు మరీ గలీజుగా, దిగజారుడుకే దిగజారేలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ బీఆరెస్ పార్టీ గెలుపు కోసం ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఒకటి తన మదిలో ఉందనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను ఓడిస్తే.. మూడేళ్ల దాకా ఆగేది లేదన్నాడు. పాపం.. బీఆరెస్ లీడర్లు పదేండ్లు అధికారం అనుభవించి.. ఇంకా మూడేండ్ల పాటు ఆగేలా లేరని ఆయన మాటల్లో అర్థమైంది. ఈయన షాడో సీఎంగా అధికారాన్ని అనభవించి .. ఇప్పుడు రెండేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండటంతో ఫ్రస్టేషన్ పీక్కు వెళ్లి.. తలతిక్కగా రోజుకో రకంగా మాట్లాడుతూ తీవ్ర గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు ఇలా. దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యిదంటాడు. 13వేల దొంగ ఓట్లు సృష్టించారని కూడా అన్నాడు.
అంటే తాము ఓడిపోబోతున్నామని ముందే ఈ విధంగా చెప్పుకున్నాడన్నమాట. ఓడిపోగానే… దొంగ ఓట్లతో గెలిచారు… అని చెప్పుకోవడానికి ముందే ఇలా ప్రిపేరయ్యాడన్నమాట. ఓడిపోతున్నామని ముందే ఒప్పుకుంటూ.. కాంగ్రెస్ను ఓడిస్తే మనదే మళ్లీ అధికారం.. ఇంకా మూడేండ్లు ఆగాల్సిన అవసరం లేదని చెప్పడం కేటీఆర్ మతితప్పిన, సోయిలేని మాటలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజాతీర్పునే కించపరిచేలా ఇలా చాలా సార్లు కేటీఆర్ మాట్లాడి మరింత చులకనయిపోయాడు. మాది తప్పేకాదు. మా పాలనలో లోపమే లేదు.. జనాలే పిచ్చోళ్లు.. ఓట్లేసి అనుభవిస్తున్నారు.. అంటూ కేటీఆర్తో సహా కేసీఆర్ కూడా చాలా సార్లు వ్యాఖ్యానించి ఇంకా తమలో పరివర్తన రాలేదని, ఇంకా అహంకారం ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇలా కేటీఆర్ మరోసారి తన చాపలత్వాన్ని చాటుకున్నాడు. అధికారం కోసం, రాజకీయం కోసం తను మరింతగా దిగజారి పాతాళంలోకి పడిపోయానని తనకు తానే ఇలా చెప్పుకుంటున్నాడు.
