(దండుగుల శ్రీనివాస్ – వాస్తవం)
ఏ దోసితీ హమ్ నహీ చోడేంగే! ఈ పాట వినని వారుండరు. ఇప్పుడిదెందుకంటారా? పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, కూరగాయల రమేశ్..అదే కరాటే రమేశ్.. ఇద్దరూ మంచి మిత్రులు. చాలా ఏళ్లుగా. కాంగ్రెస్లోనే చాలా ఏళ్లుగా ఇద్దరూ కొనసాగుతూ వస్తున్నారు. కరాటేలో మహేశ్కు బ్లాక్ బెల్ట్. అందరికీ కరాటే నేర్పించేవారు. ఈయన కూడా అందరిలో ఒక శిష్యుడు. కానీ తక్కువ కాలంలోనే మహేశ్కు మంచి మిత్రుడయ్యాడు. ఆప్తుడుగా ఉన్నాడు. కష్టాలలో, సుఖాలలో ఉంటూ వచ్చాడు. గురువు చూపిన బాటలోనే తనూ కరాటే తరగతులను ఇప్పటికీ నిర్వహిస్తూ వస్తున్నాడు రమేశ్. అందులో వచ్చే అరకొర ఆదాయంతో సంసారం నెట్టుకొస్తున్నాడు.
ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చాలా కాలంగా ఆ కులానికి సేవలందిస్తూ అందరికీ తలలో నాలుకలా ఉంటున్నాడు. పోయినసారి కూడా కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయాడు రమేశ్. ఈసారి మళ్లీ బరిలోకి దిగాడు. తన సతీమణి ఉమారాణిని పోటీ చేయించి విజయం సాధించాడు. అనూహ్యంగా వచ్చిన అవకాశం… మిత్రుడికి మేలు చేసే వీలు.. కుల, రాజకీయ సమీకరణలు కలిసి రావడం.. అంతిమంగా ఉమారాణి రమేశ్ మేయర్ పీఠం ఎక్కనున్నారు. ఇదిప్పుడు ఇందూరు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామం అందరిలోనూ సంతోషం నింపింది. సాధారణ కుటుంబం.. రాజకీయంగా ఉన్నతంగా ఎదగడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
