మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు
చాలా రోజుల తరువాత ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు చూశాం. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత ట్రెండ్ మారింది. మార్పు కనిపించింది. గతంలో అంతా ఏకపక్షం. కేసీఆర్ ఒక్కడే చెప్పాలె. అందరూ వినాలె. ఆయన పిట్టకథలు, ప్రసంగం విని అబ్బ బాగుంది అనుకోవాలె అంతే. ఇతరులకు అవకాశం వచ్చేది కాదు.ప్రశ్నించే చాన్సేలేదు. అడిగే అవకాశమే రాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.ఈ బడ్జెట్ సెషన్ గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలె. అసెంబ్లీ సెషన్ అద్బుతమనే చెప్పాలి. ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ నిడిపామని చెప్పుకునే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని అంశాల్లో తడబడ్డా మంచి సమాధానాలె ఇచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ సభ్యులు ఇంకొంచెం ప్రిపేర్ అయి రావాల్సిన అవసరం కనిపించింది. అక్బర్ వాగ్దాటితో మ్యాన్ ఆఫ్ అసెంబ్లీగా నిలిచాడు. రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాళ తీసిందనే విధంగా మాట్లాడటం నైతిక స్థైర్యం దెబ్బ తీసింది.
సంక్షేమ పథకాలకు మంగళ పాడినట్టేనని చెప్పకనే చెప్పారు సీఎం. గతంలో అసెంబ్లీ ఏకపక్షంగా ఉండె. ఇప్పుడు అఖిలపక్షంగా మారింది. పెద్దలు జానారెడ్డి అంటూ కేసీఆర్ చుట్టే అసెంబ్లీ నడిచేది. కానీ ఇప్పుడు గంటల తరబడి మాట్లాడే అవకాశం ప్రతిపక్ష సభ్యులకు దక్కింది. గతంలో ఎంఐఎం గానాబజానా ఉంటుండె. తానాతందానాకే పరిమితం అవుతుండె. కేసీఆర్ గతంలో కులాల గురించి, బీసీల రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు. తను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఇప్పుడలా లేదు. అన్ని పక్షాలను సంప్రదించడం, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం.. ఇదో మంచి వేదికగా మారింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇదే విధమైన ట్రెండ్ నడుస్తోంది. ఈ బడ్జెట్ సెషన్ అర్థవంతంగా మారిందనే చెప్పాలి. ఇంత అవకాశం వస్తదని ఎవరూ అనుకోలేదు. ఈ సభలో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నీ కలగలిసినయి. నిండు సభ ప్రజాస్వామ్యం ఫరిడవిల్లినట్టుగా కనిపించింది.
కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కొన్ని విషయాల్లో తడబడ్డారు. జీరో అవర్ నుంచి క్వశ్చన్ అవర్ వరకు ప్రతిపక్షాలకు మంచిగా మాట్లాడే అవకాశం ఇచ్చారు. ద్రవ్య వినిమయం బిల్లు వరకు పద్దతి ప్రకారం జరిగింది. ఒక్కడే మాట్లాడటం, వన్సైడ్ వార్ అన్నట్టు లేదు. బాగుంది. పన్నెండు రోజులు పాటు జరిగిన ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం దొరికంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం, డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం, అవయవాల మార్పిడిని సులభతరం చేస్తూ చట్టం…కీలకమైన ఘట్టాలకు ఇది వేదికైంది.
బడ్జెట్ సమావేశాలు మొత్తం 11 రోజులు, మొత్తం 97 గంటల పాటు సాగాయి. ఇందులో అధికార పార్టీ సభ్యలు 65 గంటలు మాట్లాడగా, బీఆరెస్ 38 గంటలు, బీజేపీ 8 గంటలు, ఎంఐఎం ఏడు గంటలు. సీపీఐ గంట పాటు మాట్లాడింది. కాగ్ నివేదిక సెషన్లో విడుదలైంది.