(దండుగుల శ్రీనివాస్)
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వేసిన పొలిటికల్ బాంబుల కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. డేట్లు కూడా ఫిక్స్ చేసి మరీ ఆయన చెప్పడంతో అందరికీ ఏదో జరగబోతుందనే విషయం క్లారిటీకి వచ్చింది. దీపావళికి ముందు ఒకరి అరెస్టు ఉంటుందని, వచ్చే నెల (నవంబర్) మొదటి వారంలో కీలక నేతల అరెస్టుల పర్వం ఉంటుందని చెప్పుకొచ్చాడాయన. దీంతో ఎవరు అరెస్టవుతారు..? ఎవరు జైలుకు వెళ్తారు..? ఎవరెవరిపై ఎలాంటి కేసులు పెడతారు..? అనే విషయంలో అన్ని పార్టీల్లో చర్చ జరుగుతున్నది. అయితే కేటీఆర్ దీనిపై స్పందించిన తీరు చూస్తుంటే తనను జైలుకు పంపుతారని పరోక్షంగా ఒప్పుకున్నట్టే ఉంది. ఏవో తప్పుడు కేసులు పెట్టి తనను జైలుకు పంపుతారు కావొచ్చు అని కేటీఆర్ ఒప్పుకున్నాడు. అంటే ఏదో ఒక కేసులో బలమైన ఆధారాలేవో సీఎం రేవంత్రెడ్డికి దొరికి ఉంటాయని భావించి ఉండవచ్చు. అందుకే బాబు, రాజశేఖర్రెడ్డిలాంటోళ్లను చూశాం… చిట్టినాయుడు ఒక లెక్కా అంటూ మళ్లీ రేవంత్పై అదే నోటి దురుసు వ్యాఖ్యలు చేశాడు కేటీఆర్.
దీనిపై బీఆరెస్ శిబిరంలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. కేటీఆర్ జైలుకు పోతే ఎట్లా అనే విషయాన్ని కూడా ఇప్పట్నుంచి డిస్కషన్ చేసుకుంటున్నారు. పోతే పోయాడు.. జైలుకు పోయి వచ్చిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారు కదా.. మా బాస్ కూడా సీఎం అవుతాడేమో అందుకే జైలుకు పోతాడేమో అని సర్దిచెప్పుకుంటున్నారు. ఇక దీనిపై అధికార వర్గాల్లో ఓ రకమైన ఆందోళన నెలకొన్నది. లీడర్లంతా ఒక్కటే.. వారకేమీ కాదు… మధ్యలో బలయ్యేది అధికారులేనని వారంతా అనుకుంటున్నారు. నాడు రాజశేఖర్రెడ్డి టైంలో కూడా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని జైలు పాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ సర్కార్లో ఎమ్మార్వో నుంచి మొదలుకొని సీసీల దాకా వీరినే బలి చేసి జైలుకు పంపుతారనే వాదన ఆ సెక్షన్ నుంచి వస్తోంది.
ఓ కేటీఆర్, కేసీఆర్, హరీశ్రావులు… ఎక్కడైనా సంతకాలు పెడతారా..? వారి పేరు మీద ఆస్తులు రాయించుకుంటారా..? ఆధారాలతో సహా ఎక్కడ దొరుకుతారు..? విచారణలో బయటపడేది, దొంగగా బోనులో నిలిచేది అధికారులే అని ఓ సంఘం నేత వాస్తవం ప్రతినిధితో అన్నారు. దీన్ని బట్టి చూస్తూ తొలత అధికారులే టార్గెట్గా కేసుల పర్వం కొనసాగుతుండవచ్చు. ఆ తరువాత నేతల దాకా తీసుకెళ్తారేమో. కానీ పొంగులేటి అన్నట్టుగా, డేట్లు ఫిక్స్ చేసినట్టుగా అంత త్వరగా అరెస్టులు, జైళ్లకు పంపడం ఉంటుందా..? అనే అనుమానాలు మాత్రం లేకపోలేదు.