దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి:
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్యాడీ కుంభకోణానికి పాల్పడ్డాడనేది స్పష్టమైంది. రూ. 81 కోట్ల ప్రభుత్వ ధాన్యాన్ని అమ్మేసుకున్నాడని సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించినా షకీల్ ఇప్పటి వరకు ప్రభుత్వానికి చెల్లించింది కేవలం రెండు కోట్లే. ఇంకా 79 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా షకీల్కు ఇంత ధాన్యం కేటాయింపుల వెనుక ఎవరి హస్తం ఉందా అని ఆరా తీస్తే డీఎస్వో చంద్రప్రకాశ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఎంక్వైరీ పూర్తి కాగానే చంద్రప్రకాశ్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
దీనిపై జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సీరియస్గా ఉన్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని షకీల్కు అప్పనంగా అప్పగించడంపై అటు ప్రభుత్వం మరింత సీరియస్ అయ్యింది. కలెక్టర్పై ఒత్తిడి పెరిగింది. వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో డీఎస్వోపై విచారణ జరుగుతోంది. ఫకీల్ పేరుతో పాటు ఇంకా నాలుగు పేర్లతో మిల్లులు ఉన్నాయి. షకీల్ ఒక్కడే ధాన్యానంతా తెప్పించుకుని తన ఇతర మిల్లులకు వాటిని సీఎంఆర్ కోసం పంపాడు. కానీ వాటిని పంపానని చెప్పినా.. వాస్తవానికి అవన్నీ పక్కదారి పట్టాయి. బహిరంగ మార్కెట్లో షకీల్ వాటిని అమ్మేసుకున్నాడు. ఇలా దీనిపై తీగ లాగితే డొంక కదిలింది.