దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

బాల్కొండ ఆఫీసర్లకు చచ్చే తలనొప్పి వచ్చిపడింది. ఇక్కడ గెలిచింది వేముల ప్రశాంత్‌రెడ్డి. ఓడింది సునీల్‌ రెడ్డి. కానీ ఎమ్మెల్యే లెవల్లో నడిపించుకుంటుంది మాత్రం సునీలే. ముందే అధికార పార్టీ. ఓడినా అధికారం చెలాయించేస్తున్నాడు సునీల్‌ రెడ్డి. తాజాగా అతను బాల్కొండ తహసీల్దార్లందరికీ ఓ మెసేజ్‌ పంపాడు. అదేమిటంటే.. ఇకపై ఎవరూ ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేయొద్దు. వాటిని స్పెషల్‌ ఆఫీసర్ల ద్వారానే ఇప్పించండని. ఇదెక్కడి లొల్లిరా బాబు అని నెత్తికొట్టుకుంటున్నారట తహసీల్దార్లు. ఇప్పుడు ఈ విషయం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతున్నది. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది తహసీల్దార్ల పరిస్థితి.

ఎమ్మెల్యేకు మర్యాద, గౌరవం ఇవ్వాలి. మరి సునీల్‌ మాట వినకపోతే ఎలా..? వింటే ఓ బాధ.. వినకపోతే మరో బాధ అన్నట్టుగా తయారయ్యింది వారి పరిస్థితి. రెవెన్యూ శాఖలో ప్రస్తుతం ఇదే అంశం తీవ్ర చర్చకు తెర తీసింది. తక్షణ కర్తవ్యమేమిటీ..? అని తహసీల్దార్లంతా తలలు పట్టుకుంటున్నారు. అందరూ కలిసి సునీల్‌ దగ్గరికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారట. పరిస్థితి వివరించేందుకు. మీకు మీకు రాజకీయంగా సవాలక్ష ఉంటాయి..సార్.. ! మధ్యలో మమ్మల్నెందుకు లాగడం..? మా పనిని మమ్మల్ని పద్దతి ప్రకారం చేసుకోనివ్వండని బతిమాలుకుంటారట. మరి మన సునీల్‌ వింటాడో వినడో తెలియదు మరి.

You missed