పాదయాత్రలో అస్వస్థతలకు గురై ఆస్పత్రి పాలైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోలుకుంటున్నాడు. మోకాలికి ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఈరోజు ఆయనను డిశ్చార్జి చేస్తున్నారు. నేరుగా ఆస్పత్రి నుంచి హుజురాబాద్కు వెళ్లనున్నాడు. అక్కడే ఉండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నాడు. మోకాలి ఆపరేషన్ తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో.. ఓ వారం తర్వాతే ఆయన తిరిగి పాదయాత్ర ప్రారంభించే అవకాశాలున్నాయి. ఎక్కడైతే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
గతంలో మాదిరిగా కాకుండా పరిమిత ఏరియాలను ఎంచుకొని పాదయాత్ర చేయాలని భావిస్తున్నాడు. మరోవైపు ఈటల దవాఖాన పాలైనా.. టీఆరెస్ సోషల్ మీడియా అతన్ని వెంటాడుతూనే ఉంది. చక్రాల కుర్చీలో మమతలాగా కూర్చుని పాదయాత్ర చేస్తాడని, ప్రజల సానుభూతి కోసం ఎత్తుగడ వేస్తున్నాడని పోస్టింగులు పెడుతున్నది. వెటకారాలు, విమర్శలు, ప్రతివిమర్శలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎవరూ తగ్గడం లేదు. ఎన్నిక ముగిసేలోపు ఈ వ్యంగ్యాస్త్రాల వాడి మరింత పెరగనుంది.
