హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే కేసీఆర్ ఈటల రాజేందర్పై అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసే ప్రక్రియ నుంచి నేటి వరకు ఎక్కడా తగ్గడం లేదు. వెంటాడుతూనే ఉన్నాడు. నిను వీడని నీడను … అన్నట్టు ఆయన రాజకీయమంతా ఇప్పుడు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నది. ఈ సమయంలోనే దళితబంధుకు రూపకల్పన తుదిరూపులు దిద్దుకుంటుంది. దీన్ని హుజురాబాద్లోనే ఫైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని ఆయన ప్రకటించడం విమర్శల పాలైంది. అయినా కేసీఆర్ వెనక్కి తగ్గలే. అవును మాది ఫక్తు రాజకీయమే.. మేం లబ్ది పొందొద్దా అని బహిరంగంగానే సమర్థించుకున్నాడు. కౌశిక్రెడ్డిని గుంజేసుకున్నారు. ఎల్ రమణకు పదవి ఆశచూపి కలిపేసుకున్నారు. దళితబంధును ఆర్భాటంగా అక్కడ అమలు చేసేందుకు అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. కానీ తాజాగా హుజురాబాద్కు చెందిన ఓ దళిత నేతతో కేసీఆర్ మాట్లాడుతూ ఈటలపై చేసిన కామెంట్లు మళ్లీ దుమారం లేపాయి. రాజేందర్ చాలా చిన్నోడు.. వాడితో వచ్చేదుందా? సచ్చేదుందా? అని కామెంట్ చేశాడు. ఓ వైపు అన్ని రకాలుగా ఈటల రాజేందర్ పై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తూనే కేసీఆర్ మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుకు కేసీఆర్ ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నాడో ఆయన చెప్పకనే చేసే చర్యల ద్వారా ప్రజలకు తెలియజెప్తూనే ఉన్నాడు.