(దండుగుల శ్రీనివాస్)
కడుపు నిండినోడికి పేదోడి ఆకలి కడుపు కేక ఎట్ల తెలుస్తుంది? తను ఏది చెబితే అది జనం మెచ్చి మెడలేసుకుంటారని భ్రమ పడుతూ ఉంటాడు గరికపాటి. ఇలా తొందరపడి నోటితీత మాటలు మాట్లాడి.. సహజంగానే తనలో నిక్షిప్తమై ఉన్న భావావేశాన్ని ప్రదర్శించి.. జనం ప్రకోపానికి గురై తత్తరపాటు పడుతూ ఉంటాడు. ఇప్పుడూ అదే చేశాడు. సర్కార్ బడుల్లో మధ్యాహ్నం భోజనం పెట్టడం దండుగన్నాడు. చదువుతందుకు పోతున్నరా? లేక తింటందుంకా? ఆ గుడ్డు పెట్టుడెందుకు? పంతుళ్లకు ఈ గుడ్ల లెక్కలు రాసుకునే ఖర్మేందీ? అని ఏవేవో వాగేశాడు తనకు అలవాటైన సహజ దోరణిలో. దీనిపై సోషల్ మీడియాలో గరికపాటిపై దుమ్మంతా ఎత్తిపోశారు. పేదల ఆర్థిక పరిస్థితి, పౌష్టికాహార దుస్థితి.. అన్నీ వడ్డించేశారు గరికపాటి ముందు. అది తినలేక అజీర్ణమై అవాక్కై.. గాయిగత్తరైపోయాడనుకో మన జగమెరిగిన బ్రాహ్మడు. అవు.. బ్రాహ్మడంటే గుర్తొచ్చింది. ఆయనకేం తెలుసు పేదల జీవన స్థితిగతులు.
ఎండినోడి బాధలు ఈ నిండినోడికి ఎలా ఎరుకవును..కదా! అసలు చదువులే లేని జీవితాలు మావి. ఇలా అరొకర, అత్తెసరు చదవులు ఇంకొందరివి. మీకేమో చిన్నప్పట్నుంచి ఇంగిలిపీసు చదువులాయె.. అందుకే మా సర్కార్ బడుల బువ్వ మీకు ఎంగిలి మెతుకులకన్నా అధ్వాన్నమైపోయింది కదా? అవునూ ఈ కాంగిరేసోళ్లున్నారే.. అసలు వీళ్లకు ఏం జరుగుతుందో కూడా సరిగ్గా తెల్వదు. ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిందే దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తాజాగా దీన్ని ఇంటర్ వరకు పొడిగిస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించిందీ ఈ కాంగ్రెస్ పార్టీయే. మరి గరికపాటి లాంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడితే కాస్తైనా గడ్డి పెట్టొద్దూ.. ! ఏహె ఇది మన టాపిక్ కాదనుకున్నారో.. ఆ సబ్జెక్టు మనకు తెలియదని ఊరుకున్నారో గానీ కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం సైలెంట్గానే ఉంది ఈ విషయంలో. అంతటి నాలెడ్జి మరి మనోళ్లకు.

Dandugula Srinivas
7661066999
